తాను నిత్య విద్యార్థినని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు. నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నెల్లూరు తన అమ్మ ఊరని, అక్కడే పుట్టి పెరిగినట్లు చెప్పారు.
అందుకే నెల్లూరు అంటే ఎనలేని అభిమానం అని అన్నారు.కానీ మొక్కలంటే తనకు విపరీతమైన ప్రేమ అని నెల్లూరులోని ఇంట్లో చెట్లు లేకపోవడం వల్లనే అక్కడ ఉండలేకపోయినట్లు చెప్పుకొచ్చారు.పదో తరగతి గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు చెప్పిన పవన్.. చదువు మధ్యలో ఆపినా.. చదవడం మాత్రం ఆపలేదని అన్నారు. చిన్నప్పుడు గొప్ప గొప్ప ఆశయాలేం ఉండేవి కాదని, సబ్ ఇన్స్పెక్టర్ కావాలని మాత్రం ఉండేదని అన్నారు. ప్రజలను రక్షించేందుకు ఖాకీ చొక్కా వేసుకోవాలని భావించినట్లు చెప్పారు. అది కుదరకపోయినప్పటికీ సాటి మనిషికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ ప్రారంభించినట్లు పవన్ చెప్పారు.
అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కీలకంగా పని చేసినట్లు స్పష్టం చేశారు.ఇందుకోసం సమాజాన్ని కూడా అధ్యయనం చేశానన్నారు ఇంటితోపాటు చుట్టాల ఇళ్లల్లోనూ రాజకీయ వాతావరణం కారణంగా రాజకీయ స్పృహ పెరిగిందని, సాటి మనిషికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయం తనకు ఒక బాధ్యత అని ఆయన చెప్పారు.అధికారం ఏమీ తనకు పరమావధి కాదని కూడా అన్నారు.కాగా నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా.. పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్.. రైతులకు తక్షణ సహాయం అందివ్వాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. మద్యపానం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని, తక్షణమే సాయం చెయ్యాలని పవన్ డిమాండ్ చేశారు.ఆపదలో ఉన్న రైతులను ఆదుకున్నప్పుడే ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించినట్లని పవన్ కళ్యాణ్ చెప్పారు.తన మొదటి ప్రాధాన్యత రైతేనని, వారికి కష్టనష్టాల్లో ఎప్పుడూ అండగా ఉంటానని జనసేనాని ఉద్ఘాటించారు.