YS Sharmila: సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాలనలో ఒక్కటన్నా సక్కగుందా చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో ఆపద ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు 20 నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు ఎక్కడ పోయాయి CM సారు? అంటూ ట్వట్టర్ లో నిలదీశారు.
కరోనా రోగుల నుంచి ప్రైవేట్ అంబులెన్సులు అడ్డగోలుగా దోచుకొంటుంటే మీకు కనిపించడం లేదా ? కరోనా డెడ్ బాడీలను తరలించేందుకు రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా? పేషేంట్ల కోసం అంబులెన్సులు లేవు, టెస్టులు చేసే కిట్లు లేవు, పట్టించుకొనే డాక్టర్లు లేరు, ఊపిరి నిలిపే ఆక్సిజన్ లేదు, వాక్సిన్ లేదు అనే సమాధానాలు సర్వసాధారణం అయిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నువ్వు ఏం చేయలో నీకు కోర్టులు చెప్పాలే, నీకు పరిపాలన అంత చేతకానప్పుడు.. కోర్టులకో లేక గవర్నర్ కో నీ పాలనను అప్పగించు కేసీఆర్ దొర అంటూ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో సూచించారు.
బండి సంజయ్ కూడా బాదేశారు
రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.ప్రజల ప్రాణాలను కాపాడాలనే సోయి కేసీఆర్ కు ఉంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలను అమలు చేయాలన్నారు.ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బకాయిలను వెంటనే చెల్లించి ఆ తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలన్నారు బండి సంజయ్. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 440 టన్నుల ఆక్సిజన్ను కేటాయించిందని, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చిందని ఆయన అన్నారు. అయినా వాటిని ఎందుకు ఏర్పాటు చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.కేంద్రం 1,250 వెంటిలేటర్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినియోగించట్లేదని ప్రశ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించలేదని అన్నారు. కేసీఆర్ కు కూడా కరోనా వస్తే ప్రజల ఇబ్బందులు ఏంటో అర్థం అవుతాయి అనుకున్నాం..కానీ ప్రజలు కరోన తో ఇబ్బందులు పడుతుంటే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తొట్టి గ్యాంగ్ ను పెట్టి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారన్నారు.