AP CM YS Jagan: రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను నేడు విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్ గురువారం కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వై ఎస్ ఆర్ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 52లక్షల 38వేల మంది రైతుల ఖాతాలో 3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రూ.13,500లు అందజేస్తున్నామని జగన్ తెలిపారు. ఖరీఫ్ కు ముందు మొదటి విడత కింద రూ.7,500లు అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా దేవాదాయ శాఖ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందుతోందన్నారు.
ఇప్పటి వరకూ రైతు భరోసా కింద 13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశామని చెప్పారు. 23 నెలల పాలనలో ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ పంటల భీమా, వైఎస్ఆర్ భరోసాల కింద రైతులకు 68వేల కోట్లు సాయం చేశామని వైఎస్ జగన్ అన్నారు.