నాడు అమరావతిలో అంతా తామై ..నేడు గాయబ్
కేసుల భయం..అందుకే ఈ మౌనం..!!!
చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ఇద్దరూ కీలక మంత్రులుగా పని చేసారు. అమరావతి రాజధానిగా ఖరారు చేసిన సమయం నుండి అధికారం కోల్పోయే వరకూ వారిద్దరే అమరావతి శిల్పులుగా కలరింగ్ ఇచ్చారు. రైతుల నుండి భూ సమీకరణ నుండి…అధికారులకు ఎవరితో ఎలా డీల్ చేయాలో అదే చేసారు. చంద్రబాబు సైతం వీరిద్దరికే అమరావతి పూర్తి బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు రాజధాని పైన ఏర్పాటు చేసిన కమిటీలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక, చంద్రబాబు శైలి బాగా తెలిసిన వారిద్దరూ ఆయనను మెప్పించటం కోసం తెగ ప్రయత్నాలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ ఇద్దరూ పత్తా లేకుండా పోయారు. రాజధాని పైన రగడ సాగుతున్న సమయంలో నాడు కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మాజీ టీడీపీ మంత్రులు ఏమయ్యారు. వారి మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉండటంతో ఈ మొత్తం వ్యవహారానికి దూరమయ్యారా..లేక ఇప్పటికే వైసీపీ చేతికి చిక్కారా..చంద్రబాబు కు సైతం వారు అందుబాటులోకి రావటం లేదని ప్రచారం సాగుతోంది. ఇంతకీ వారిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు…
మాజీ మంత్రులిద్దరూ ఎక్కడ…
2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో వారిద్దరూ చంద్రబాబు కేబినెట్ లో మంత్రులయ్యారు. కీలక పోర్టుఫోలియోలు దక్కించుకున్నారు. ఒకరు చిలకలూరిపేట నుండి గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు కాగా..మరొకరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ. విద్యా సంస్థల అధినేత గా ఉంటూ టీడీపీకి చేసిన ఆర్దిక సాయానికి ప్రతిఫలంగా ఆయనకు కీలకమైన మున్సిపల్ శాఖ దక్కింది. దీంతో..రాజధాని కమిటీ ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. తన శాఖకు సంబంధించిన అంశాల కంటే అమరావతి..సింగపూర్ మధ్యే నారాయణ మంత్రి హోదాలో ఎక్కువగా పర్యటనలు చేయటం..రాజధానిలో ప్రతీ నిర్ణయం వెనుక నారాయణ కీలకంగా వ్యవహరించారు. తాత్కాలిక భవనాలకు టెండర్లు ఖరారు చేయటంలోనూ…రేట్ ఫిక్స్ చేయటంలో ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే అయినా వాటిని ఆ రకంగా సిద్దం చేసింది మాత్రం నారాయణ. ఇక, లాండ్ పూలింగ్ లో బుజ్జగింపులు..బెదిరింపులతో జిల్లా మంత్రి పుల్లారావు మంత్రిగా తన సామర్ద్యం ఏంటో అక్కడి రైతులకు చూపించారు. అదే విధంగా ఎడాపెడా వారికి హామీలు గుప్పించారు. అమరావతిలో అంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఏమయ్యారు. రాజధానుల వివాదం..అమరావతి నుండి పాలనా రాజధాని తరలింపు.. రాజధానిలో చేసిన ఖర్చు పైన ఇంతగా రచ్చ జరుగుతున్నా..టీడీపీ అధినేత సవాళ్లు చేస్తున్నా..ఈ ఇద్దరు మాత్రం జోక్యం చేసుకోవటం లేదు. చంద్రబాబుకు అందుబాటులోకి రావటం లేదని సమాచారం.
వైసీపీ చేతికి చిక్కినట్లేనా…కేసుల భయమా
వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తున్న అమరావతి భూముల వ్యవహారంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఈ ఇద్దరి పేర్లను బయట పెట్టారు. మంత్రిగా పని చేసిన నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో దాదాపు 3129 ఎకరాలు కొనుగోలు చేసారనేది వైసీపీ ఆరోపణ. నారాయణ వద్ద పని చేసే పలువురు దాదాపు 432 కోట్లు ఖర్చు చేసి ఆ భూములు కొనుగోలు చేసారు. అయితే, అవి బినామీల పేర్లతో నారాయణే కొనుగోలు చేసారని..ఆయన వద్ద పని చేసే వారికి అంత ఆర్దిక స్థోమత లేదనేది వైసీపీ ఆరోపణ. ఇక, మరో మాజీ మంత్రి పుల్లారావు సైతం అసైన్డ్ భూములతో కలిపి దాదాపు 196 ఎకరాల భూమిని కొనుగోలు చేసారని..అందుకోసం సుమారు 39 కోట్లు వెచ్చించారని వైసీపీ ఆరోపించింది. అయితే, అప్పట్లో శాసనసభలో ఇదే అంశం పైన చర్చ జరిగినప్పుడు వారిద్దరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే వారిని కేబినెట్ నుండి డిస్మిస్ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి భూస్కాం పైన విచారణ చేస్తోంది. కొందరు అధికారులతో సహా మరి కొందరిని అరెస్ట్ చేసింది. దీంతో..అమరావతి మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీతో రాజీ ఫార్ములా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇప్పుడు వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతున్న మాజీ మంత్రి గంటాకు ..నారాయణ వియ్యంకుడు. పుల్లారావు క్లాస్ మేట్..అత్యంత సన్నిహితుడు. దీంతో..వీరిద్దరూ కేసులు లేకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మౌనంగా..టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.