భారీ వర్షం కురిస్తే వచ్చే వరద ప్రవాహానికి నగరాల్లో ఏ రోడ్డుపై మ్యాన్హోల్ ఎక్కడ ఉందో తెలియక చాలా మంది అందులో పడి మరణిస్తుంటారు. కొందరు గాయాల బారిన పడుతుంటారు. ప్రతి వర్షాకాలంలోనూ దేశంలోని అనేక నగరాల్లో పౌరులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి ఓ మ్యాన్హోల్ వద్ద ఓ మహిళ సుమారుగా 7 గంటల పాటు కాపలాగా ఉంది. భోరున వర్షం పడుతున్నా ఆమె అన్ని గంటలపాటు అక్కడే నిలుచుని మరీ మ్యాన్హోల్లో ఎవరూ పడకుండా చూసింది. దీంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
ముంబైలోని మాతుంగలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై ఉన్న ఓ మ్యాన్హోల్ పొంగి పొర్లింది. దీంతో సమీపంలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల కాంత మూర్తి కలన్ అనే మహిళ ఆ మ్యాన్ హోల్ వద్దకు చేరుకుని అక్కడే నిలుచుంది. సుమారుగా 7 గంటల పాటు నిలుచుని వరద తగ్గేవరకు, మ్యాన్ హోల్ వద్దకు మున్సిపల్ సిబ్బంది చేరుకునే వరకు అక్కడే కాపలాగా ఉంది. అనంతరం సిబ్బంది వచ్చి ఆ మ్యాన్హోల్కు మరమ్మత్తులు చేశారు. కాగా ఆమె ఆ సమయంలో అక్కడ నిలుచున్నప్పుడు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Mumbai: Kanta Murti, who was seen in viral video (of August 4) guarding an open manhole in Matunga to avert accidents, says she stood there for 7 hours.
Says, "I uncovered the manhole to drain water & stood there to warn vehicles. BMC officials came later & scolded me for it." pic.twitter.com/dOTKG5hZdW
— ANI (@ANI) August 10, 2020
కాంత మూర్తి కలన్ అలా అన్ని గంటల పాటు వర్షంలో నిలుచుని మ్యాన్హోల్కు కాపలా కాయడంతో నెటిజన్లు అందరూ అమెను ప్రశంసిస్తున్నారు. కాగా ఆమెకు మొత్తం 8 మంది సంతానం. 5 మందికి పెళ్లిళ్లు అయ్యాయి. మరో ముగ్గురు పిల్లలను ఆమె ప్రస్తుతం చదివిస్తోంది. స్థానికంగా పూలు అమ్ముతూ ఆమె జీవిస్తోంది. గత కొన్నేళ్ల కిందట ఆమె భర్త రైలు ప్రమాదం బారిన పడి పక్షవాతం వచ్చింది. దీంతో అతను మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో ఆమె కుటుంబ పోషణ, పిల్లల చదువుల బాధ్యతలను తీసుకుంది. తాజాగా ఆమె ఆ పనిచేయడంతో అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.