వైసీపీ ఫైర్ బ్రాండ్ , మంత్రి గుడివాడ అమర్నాథ్కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. చేయూత పథకం బటన్ నొక్కేందుకు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. అమర్నాథ్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అమర్నాథ్ పై కీలక కామెంట్లు చేశారు.. నాకు కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్లు. అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగుతుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.
కానీ, ఇదే వేదికపై గుడివాడ ఊసు ఎత్తకపోవడంతో ఆయనకు ఈ దఫా టికెట్ లేనట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి అమర్నాథ్కు అనకాపల్లి పార్లమెంట్ సీటు ఇస్తారని అనుకున్నారు. అలా కూడా ఇచ్చే అవకాశం లేదని తాజా పరిణామంతో తేలిపోయిందని. ఇక, తన సీటును భరత్కు కేటాయించడంతో మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు.
అయితే ఈయన ఆశలపై పార్టీ నీళ్లు చల్లింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను ఇన్ చార్జీగా నియమించారు. దీనిని ముందు ఒప్పుకోకూడదని భావించినా.. అనుచరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. ఏదో ఒక స్థానం ఇవ్వకపోతారా? అని అమర్నాథ్ ఎదురు చూశారు. కానీ, ఆ స్థానాలైన గాజువాక కు ఉరుకూటి చందు, చోడవరం నియోజకవర్గానికి సిట్టింగ్ నేత కరణం ధర్మశ్రీలను ఇన్ చార్జీలుగా వైసీపీ నాయకత్వ ప్రకటించింది.
ఇన్ చార్జీలే పార్టీ అభ్యర్థులు అంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న మూడు నియోజకవర్గాల్లో మంత్రి అమర్ కు సీటు గల్లంతయిందన్న విషయం స్పష్టమైంది. దీంతో తనకు ఎక్కడో ఓ చోట అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అమర్నాథ్కు ఎక్కడ టికెట్ ఇచ్చినా.. ఓడించి తీరుతామని జనసేన నాయకులు చెబుతున్నా రు. పవన్పై కామెంట్లు చేసిన నేపథ్యంలో వారు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అసలు టికెట్ లేక పోవడం సంచలనంగా మారింది.