చాలా మంది వైసిపి ఎమ్మెల్యేలకు ఇప్పటకీ జగన్ అపాయింట్మెంట్ లేదు. యేడాది కాలంగా జగన్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తోన్న ఎమ్మెల్యేలు కనీసం 80 మంది వరకు ఉంటారని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి కొందరు ఎమ్మెల్యేలు భారీ ప్రతిపాదనలు మంత్రుల వద్దకు తీసుకు వెళుతున్నా వాటిల్లో కనీసం 5 శాతం పనులు కూడా కాని పరిస్థితి ఉందట. దీంతో వైసిపి ఎమ్మెల్యేల వ్యవహారం చాలా నిరుత్సాహకరంగా ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటే.. మరికొందరు ఎమ్మెల్యేలు ఏకంగా వైరాగ్య భావనతో ఉన్నారని కూడా తెలుస్తుండడం గమనార్హం. ఎన్నో ఆశలు, ప్రజల్లో అంచనాలతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి ఆటలు జగన్ ఎక్కడా సాగనీయడం లేదు. ముఖ్యంగా సీనియర్లను పక్కన పెడితే జూనియర్ ఎమ్మెల్యేలు ఎంతో మహారాజ వైభోగం వెలగ బెట్టవచ్చన్న ఆశలతో భారీగా ఖర్చు చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఇప్పటికే 16 నెలలు పూర్తయ్యింది.
వీరిలో చాలా మంది పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారని టాక్. దీంతో అసలు ఏం జరుగుతోంది ? అనే చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమైనా ఉందా ? అంటే ఏమీ కనిపించడం లేదు. పైగా వారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక సహా ఇళ్ల విషయాల్లో అవినీతికి పాల్పడుతున్నారనే వాదన వ్యతిరేక మీడియాలో వెల్లువెత్తుతోంది. అయితే, ఇలా వ్యతిరేక కథనాలు వచ్చినప్పుడు మంత్రులు ఒకరో ఇద్దరో మీడియా ముందుకు వచ్చి.. ప్రతిగా కౌంటర్లు ఇవ్వడమో.. లేకపోతే.. ఎదురుదాడి చేయడమో చేసి సరిపెడుతున్నారు
ఇక, ఎమ్మెల్యేలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి పార్టీ అధికార ప్రతినిధి పదవులు కూడా ఇచ్చారు. వీరు కూడా మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఒకవైపు అనేక సంచలన కార్యక్రమాలు రూపొందిస్తోంది. అనేక సంక్షేమకార్యక్రమాలు ప్రజల్లోకి విస్థృతంగా తీసుకువెళ్లాలని చెబుతోంది. అయినప్పటికీ.. ఎమ్మెల్యేలు.. పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. గత ప్రభుత్వాన్నే తీసుకుంటే.. నిజానికి చేసింది తక్కువో.. ఎక్కువో.. పక్కన పెడితే.. ఎమ్మెల్యేలు.. ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు.అధినేత చంద్రబాబుపై ఒక్కమాట అన్నా విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేలకే అవగాహన ఉండటం లేదు.అంతా అధినేతే చూసుకుంటారన్నట్లు గా వారి ధోరణి ఉంది.బంపర్ మెజారిటీ వస్తే ఇలాంటి ప్రమాదకర పోకడలే ఎదురవుతాయని రాజకీయ పరిశీలకుడు చెబుతున్నారు. జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు