కండిషన్ అప్లై అంటూ ..గంటాను ఫిక్స్ చేసిన సీఎం..!
చక్రం తిప్పిన ఇద్దరు మంత్రులు..సీఎం అంగీకారం..!
మాజీ మంత్రి..టీడీపీ నేత గంటా టీడీపీని వీడటం..వైసీపీలో చేరటం ఖాయమైపోయింది. వైసీపీలో చేరాలని చాలా కాలంగా భావిస్తున్న విజయ సాయిరెడ్డి..అవంతి శ్రీనివాస్ పార్టీలోకి గంటా రాకను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో…గంటా రాక ఆగిపోయినట్లుగా పార్టీలో ప్రచారం.
అయితే, విజయసాయిరెడ్డికి అభ్యంతరం ఉన్నా..ఆయన్ను కాదని సీఎం జగన్ కు సన్నిహితంగా మెలిగే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి.. అదే విధంగా క్రిష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి నేరుగా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి వైసీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేయించినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన వచ్చేలోగానే గంటా సీఎం జగన్ ను కలుస్తారని తెలుస్తోంది. ఇక..ఇదే సమయంలో గంటాను పార్టీలోకి తీసుకోవాలంటే ఆయనకు జగన్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసారని..దానిని పూర్తి చేస్తేనే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో..ఇప్పుడు గంటా రాకను అడ్డుకొనేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తారా..లేక గంటా వైసీపీలో చేరటం లాంఛనమేనా..
సాయిరెడ్డి నో అన్నా..ఇద్దరు మంత్రుల మంత్రాంగం
గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారంటూ తొలుత చెప్పింది పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డే. అయితే, అప్పటికే గంటాతో ప్రస్తుత మంత్రి అవంతికి ఉన్న విభేదాల కారణంగా అవంతి వైసీపీలోకి వచ్చినా..గంటా మాత్రం టీడీపీలోనే కొనసాగారు. గంటా వైసీపీలోకి వస్తే తనకు భీమిలి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరగా..పార్టీ తిరస్కరించింది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గంటా లక్ష్యంగా అటు మంత్రి అవంతి..ఇటు రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి పదునైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా..గంటా సర్వశిక్షా అభియాన్ నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారని ఆయన జైలుకు వెళ్లటం ఖాయమనే వ్యాఖ్యలు వినిపించాయి. చాలా కాలంగా వైసీపీలోకి గంటా రావటం ఖాయమనే ప్రచారం సాగుతున్నా..ఇప్పుడు మాత్రం ఆయన రాక ఖాయమని చెబుతున్నారు. గంటాను వ్యతిరేకిస్తున్న సాయిరెడ్డి క్వారంటైన్ లో ఉండటం..అవంతి కంటే సీఎం వద్ద సన్నిహితంగా మెలిగే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి..క్రిష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి..సీనియర్ నేత గంటాను పార్టీలోకి తెచ్చేందుకు సీఎం వద్ద మంత్రాంగం నడిపి ఒప్పించినట్లు సమాచారం. సీఎం సైతం అంగీకరిస్తూనే..ఇదే సమయంలో ఆ మంత్రులు సైతం ఊహించని కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు..విశాఖ బాధ్యతలు
గంటా వైసీపీలో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైందని చెబుతున్నా..గంటా మాత్రం దీని పైన అధికారికంగా స్పందించటం లేదు. ఆయనకు దగ్గరగా ఉండే నేతలు మాత్రం వైసీపీలోకి చేరటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి వైసీపీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేల తరహాలోనే గంటా సైతం సీఎం ను కలిసి వైసీపీతో సఖ్యతగా ఉంటారు. అయితే, గంటా ప్రజారాజ్యం నుండి టీడీపీలోకి చేరే సమయం నుండి ఒక గ్రూపుగా కొందరు ఎమ్మెల్యేలను తన చేతిలో ఉంచుకున్నారు. అందులో ప్రస్తుతం అవంతి జారి పోయి..రాజకీయ ప్రత్యర్ధిగా మారారు. ఇప్పుడు విశాఖ నుండి టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఒకరు మినహా మరో ఇద్దరు సైతం గంటా బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక, గంటా వైసీపీలోకి వస్తే చాలా కాలంగా విశాఖ రాజకీయాల్లో పట్టు ఉన్న గంటా.. విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకోవాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ నేతలతో కలిసి పార్టీని గెలిపించిన తరువాతనే ఆయనకు ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయిస్తామని అధినేత సందేశంగా సమాచారం. అటు టీడీపీలో సైతం గంటా ఎన్నికలు పూర్తయిన నాటి నుండి యాక్టివ్ గా లేరని…ఇప్పుడు వైసీపీలో చేరినా అది ఆశ్చర్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, సాయిరెడ్డి..అవంతి ఏం చేస్తారు..గంటా తాను టీడీపీ వీడటం పైన ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.