ఏపిలో వైసీపీ వర్సెస్ టీడీపీ గా సాగుతున్న రాజకీయంలో ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా చేరింది. హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోగా ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమిటంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఆపాదిస్తూ వైసీపీ సోషల్ మీడియా ఆరోపణలు, విమర్శలు చేస్తుండగా మానవత్వం అనేది లేకుండా వైసీపీ ప్రవర్తిస్తోందంటూ టీడీపీ ప్రతి విమర్శలు చేస్తొంది. అయితే ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా , ఆ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేస్తూ ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
“ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. సీబీఐI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. “అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆయన మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజ మరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకు దగ్గరివాళ్లే ఎందుకిలా అర్ధాంతరంగా చనిపోతున్నారు?” అని విజయసాయి ప్రశ్నించారు. “వైఎస్ గారి మరణంపై అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా?” అన్నారు విజయసాయిరెడ్డి. “మరణించాక ఎన్టీఆర్ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్ ఫోన్కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు…పప్పుగాడి పిన్ని గారు –చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్ ఫ్యామిలీరా బాబూ మీది! ” అంటూ విజయసాయి ఆరోపణలు విమర్శలను సంధించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఇదే అంశంపై చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం ఉంది కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ రాయకపోతే తానే స్వయంగా లేఖ రాస్తానని చెప్పారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలనీ, ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదని అన్నారు లక్ష్మీపార్వతి. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారట అని వ్యాఖ్యానించారు. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం జరుగుతోందనీ, ఆమె సూసైడ్ లెటర్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు లక్ష్మీపార్వతి.