YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ.. ఇవాళ జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. మీ బిడ్డ జగన్ ఒంటరివాడు… సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు.
గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాలు చూశామన్నారు. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్దమా అని ప్రశ్నించారు. చంద్రబాబును ఒక జిత్తుల మారి, పొత్తుల మారిగా అభివర్ణించారు. నరకాసురుడు, రావణుడు దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి అని అన్నారు. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు.
పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే, మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలు… మొత్తమ్మీద 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని అడుగుతున్నానన్నారు.
సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి అని విమర్శించారు. ఇటు జగన్ ఒక్కడే… అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ వాళ్లు ఏకమయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కూడా వారికే వత్తాసు పలుకుతోంది. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు.
ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు… ఇప్పటి వరకు జరిగిన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లకు కూడా కొనసాగించే ఎన్నికలు అని అన్నారు. ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని జగన్ కోరారు. ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో, మీ అవ్వా తాతలతో కూర్చుని ఆలోచన చేయండి. మీకు ఎవరి పాలనతో మంచి జరిగిందో, మీ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి. ఈ ఎన్నికలు మన పార్టీకి ఓ జైత్రయాత్ర అయితే, మోసాల బాబుకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని జగన్ అన్నారు.