Breaking: తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. సహజంగా రాజకీయ పార్టీల్లో టికెట్ లు లభించని వారు పార్టీలు మారుతుంటారు. ప్రత్యర్ధి పార్టీలో చేరి టికెట్ లు దక్కించుకుంటుంటారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినా పలువురు నేతలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీలో కలవరాన్ని రేపుతోంది. తాజాగా వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్ధిని కడియం కావ్య కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇంతకు ముందు వరంగల్ బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారనుకున్న వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాను పోటీ చేయనని చెప్పడంతో, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ అభ్యర్ధిత్వం ఖరారు చేసింది. ఆ మరుసటి రోజే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా ఆ పార్టీ హైకమాండ్ ఆయనను ప్రకటించింది. అయితే ఇప్పుడు కడియం కావ్య కూడా తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది.
ఇవేళ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఆమె లేఖ రాశారు. తనకు వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే..గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, అలానే లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని పేర్కొన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించ డం పార్టీకి మరింత నష్టం చేస్తొందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేసిఆర్, పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు మన్నించాలని కోరారు.
ఇదిలా ఉంటే .. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్ సభ అభ్యర్ధిత్వాన్ని కడియం శ్రీహరి లేదా ఆయన కుమార్తె కావ్యకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కారణంగానే కావ్య బీఆర్ఎస్ అభ్యర్ధిత్వాన్ని వదులుకున్నట్లు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్ధులుగా ప్రకటించిన నేతలు సైతం పార్టీని వీడుతుండటం బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది.
BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి