BRS: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీలు వీడుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, మరి కొందరు బీజేపీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ ఎంపీ కే కేశవరావు (కేకే), ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 30న హస్తం పార్టీలో చేరనున్నట్లు విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యలు పరిష్కారం సులువవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఇదే అంశంపై కేకే కూడా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ తనకు సొంత ఇల్లు లాంటిదని అన్నారు. తీర్ధయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని .. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరుతానని స్పష్టం చేశారు. 53 ఏళ్లు కాంగ్రెస్ లో పని చేశానని అన్నారు. బీఆర్ఎస్ లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ లో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికైయ్యానని కేశవరావు ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్ పార్టీలోనేనని.. ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను బీఆర్ఎస్ కు ఇంకా రాజీనామా చేయలేదని అన్నారు. తమ కుమార్తె కాంగ్రెస్ లో చేరిన రోజు .. తాను ఆ పార్టీలో చేరట్లేదని చెప్పారు. కాంగ్రెస్ లో చేరే తేదీ ఖరారు అయిన తర్వాత తానే చెబుతానని అన్నారు. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండాలని అనుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని కేశవరావు స్పష్టం చేశారు.
అంతకు ముందు కేశవరావు ఎర్రవెల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లి భేటీ అయ్యారు. కేకే, ఆయన కుమార్తె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేకే కు కేసిఆర్ కబురు పంపారు. దీంతో కేకే వెళ్లి కేసిఆర్ తో సమావేశమైయ్యారు. ఈ సందర్భ లో కేసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీ ఫ్యామిలీకి పార్టీ ఎం తక్కువ చేసింది.. సాకులు చెప్పవద్దు. తగిన ప్రాధాన్యత ఇచ్చినా ఎందుకు పార్టీ మారుతున్నారు అంటూ ఆయన వద్దే అసహనం వ్యక్తం చేశారు. కేశవరావు వచ్చి కలిసిన సందర్భంలో కేసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ భేటీ అనంతరం కేకే కూడా తీవ్ర అసహనంతో ఇంటికి వెళ్లిపోయారు. కేసిఆర్ తో భేటీ అనంతరం కేకే తన అసహనాన్ని మీడియా పై ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు విజువల్స్ తీస్తుండగా ప్రస్టేషన్ కు గురైయ్యారు. తన ఇంటి వద్ద వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపైకి దురుసుగా దూసుకొచ్చారు. నన్ను వీడియో తీసుకోండి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా, కేశవరావు ఇంటికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారంటూ ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో కేకేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత తనతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కేకే పేర్కొనడంతో సస్పెన్స్ కు తెరపడింది. అయితే కేకే కుమారుడు విప్లవ్ రావు మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ప్రకటన చేశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తెలిపారు.
YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ