వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీల మనసులు గెలుచుకునే మరో పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఆగస్ట్ 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఇప్పటికే జగన్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల ఆదరణ పొందేందుకు ఈ నూతన ఈ పథకాన్ని చేపట్టారు.ముఖ్యమంత్రి ఆశయం మంచిదే అయినప్పటికీ ఇలా కేవలం సంక్షేమ పథకాల ద్వారానే అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న ఆయన ఎత్తుగడ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.నిజానికప్రజలకు డబ్బులు పంచడం ద్వారానే అధికారం శాశ్వతం చేసుకుంటామని భావించిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఈ దేశంలో మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తమిళనాడును తీసుకుంటే.. అక్కడ దివంగత సీఎంలు జయలలిత, కరుణానిధులు పందేలు వేసుకుని మరీ ప్రజాధనాన్ని ఉచితాల పేరిట పందేరం చేశారు. అయినప్పటికీ.. వారు వరుసగా అధికారంలోకి వచ్చింది లేదు. ఇక, ఏపీలోనూ గత ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు పందేరానికి పెద్దపీట వేశారు. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు జగన్ కూడా వచ్చింది వచ్చినట్టు పందేరాలకు పంచేస్తున్నారు. ఇది కూడాఅంతే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా దివంగత వైఎస్ సాధించిన విజయాల దిశగా జగన్ అడుగులు వేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.