రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెల్సిందే. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇరు జిల్లాల కలెక్టర్లను వరద ముంపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. ఖర్చుకు వెనకాడవద్దని ఈ సందర్భంగా తెలియజేసారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పంట నష్ట వివరాలను 10 రోజుల్లో తనకు అందించాలని కోరారు. నష్టపోయిన చోట్ల విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు.