ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న పరిస్థితి మామూలుది కాదు. కరోనా మహమ్మారితో ప్రజలంతా పోరాటం చేస్తున్నారు. పనులు మానుకొని పస్తులుంటున్నారు. బయటికి వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందోనని ఇంట్లోనే తలదాచుకుంటున్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఓడలన్నీ బండ్లయ్యాయి. చేతిలో చిల్లి గవ్వ లేదు. పూట గడవటమే కొందరికి కష్టంగా ఉంటోంది.
అందుకే అన్ని రాష్ట్రాల్లో కరోనా రిలీఫ్ ఫండ్ ను ప్రభుత్వాలు ప్రారంభించాయి. చాలామంది ముందుకు వచ్చి తమకు తోచినంత సాయాన్ని కరోనా ఫండ్ కు విరాళంగా ఇస్తున్నారు.
అయితే.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఓ యాచకుడి గురించి. కరోనా కాలంలో ఆయన గురించి ఎందుకు అంటారా? ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పుడు వేలమందికి ఆదర్శంగా నిలిచారు. కరోనా సహాయ నిధికి తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.
షాకింగ్ గా ఉంది కదా.. కానీ ఇది నిజం. తమిళనాడులోని మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే యాచకుడు కరోనాతో వందల మంది చనిపోవడాన్ని చూసి చలించిపోయారు. దీంతో గత మే నెలలో తన దగ్గర ఉన్న 10 వేల రూపాయలను తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ కు అందించారు. తర్వాత మళ్లీ యాచక వృత్తి ద్వారా మరో 90 వేలు సేకరించి.. వాటిని ఇటీవలే తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. మొత్తంగా తనవంతు సాయంగా లక్ష రూపాయలను ఆ వ్యక్తి కరోనా నిధికి అందించారు.
ఆయన సేవా గుణాన్ని మెచ్చుకున్న కలెక్టర్ ఆయన పేరును సామాజిక కార్యకర్తగా నమోదు చేసి ప్రశంసా పత్రాన్ని అందించారు. పాండియన్ ను చూసి చాలామంది స్ఫూర్తి పొందాలని.. పాండియన్ లాంటి వ్యక్తి ఎంతో ఉన్నతంగా ఆలోచించి సమాజం కోసం తన వంతు సాయం చేశారని కలెక్టర్ కొనియాడారు.
వావ్.. గ్రేట్ కదా.. తన దగ్గర రూపాయి లేకున్నా సాయం చేయాలనే గొప్ప మనసు ఉండటం నిజంగా గ్రేట్. పాండియన్ ను చూసి మనం చాలా నేర్చుకోవాలి.