ఏపీ అధికార పార్టీ వైసీపీ ని ముప్పుతిప్పలు పెట్టిన ఎంపీగా రఘురామకృష్ణంరాజు మొన్నటి వరకు వార్తల్లో నిలవడం జరిగింది. రాష్ట్రంలో కీలక పారిశ్రామికవేత్తగా రాణించిన రఘురామకృష్ణంరాజు… మొన్నటివరకు సొంత పార్టీ వైసిపి హైకమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏపీ మీడియాలో, రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారారు. అంతేకాకుండా పార్టీ నుండి షోకాజ్ నోటీసులు కూడా అందుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో పార్టీకి మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు కంటే పెద్ద షాక్ ఇచ్చేటట్లు వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే వైసీపీ పార్టీలో కొత్త రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన పరిమల్ నత్వాని అసలు పార్టీ హైకమాండ్ ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన టైములో వాళ్లతో కాకుండా సపరేట్ గా చేయడానికి పరిమల్ నత్వాని డిసైడ్ అయ్యారట. వైసీపీ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన సమావేశాలకి కూడా గైర్హాజరై అసలు ఏమాత్రం లెక్క చేయక పోవటం వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా పరిమల్ నత్వాని దేశంలోనే బడా పారిశ్రామిక వేత్త అ,ని ఆయన బిజెపి సిఫార్సు తోనే వైసీపీ పార్టీలో చేరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన పరిమల్ నత్వాని రిలయన్స్ అధినేత అంబానికి సన్నిహితుడు కావడంతో…. బిజెపి అధిష్టానం మరియు ముకేశ్ అంబానీ సిఫార్సు మేరకు జగన్ రాజ్యసభ స్థానాన్ని ఆయనకు కట్టబెట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అటువంటి వ్యక్తి వైసిపి అధిష్టానం చెప్పే సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఆశించడం విడ్డూరం అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటివి చాలావరకూ సాధారణమని…కానీ సామాన్యులకు విడ్డూరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సురేష్ ప్రభు రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయి రైల్వే మంత్రిగా ఉన్న రాష్ట్రం గురించి పెద్దగా పట్టించుకోలేదని, సో అదేరీతిలో పరిమల్ నత్వాని కూడా వ్యవహరించటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదని విశ్లేషిస్తున్నారు.