(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి సుప్రీం గడప తొక్కింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తును నిలుపుదల చేయాలని ఏపి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాజధాని అమరావతి ప్రాంతంలో అడ్వొకేట్ జనరల్గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన బంధువుల పేరుతో భూములను కొనుగోలు చేశారనీ ఏసిబి కేసు నమోదు చేసింది. రాజధాని భూముల కొనుగోళ్లు అమ్మకాలపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం వాటిపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది.
అయితే తనపై కక్షసాధింపునకే అక్రమంగా కేసు నమోదు చేశారంటూ దమ్మాలపాటి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు…ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏఫ్ఐఆర్ లోని అంశాలను ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దమ్మాలపాటి కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ నేతలు, మంత్రులు ఆక్షేపించారు. నేడు హైకోర్టు ఉత్తర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.