2014 ఎన్నికలలో గెలిచిన చంద్రబాబుని ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ముప్పుతిప్పలు పెట్టిన అంశాలలో ఒక అంశం ఏపీ కి “ప్రత్యేక హోదా”. ఈ నినాదం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో జగన్ పార్టీ తరఫున మీటింగ్ లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన “ప్రత్యేక హోదా” విషయంలో సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దగ్గర లాలూచీ పడి, ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయి ఏం మాట్లాడలేకపోతున్నారు అంటూ అప్పట్లో జగన్ విమర్శలు చేస్తూ రాజకీయంగా టిడిపిని ఇరకాటంలోకి నెట్టారు. అదే రీతిలో వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ని తీసుకు వస్తా అంటూ, అప్పట్లో జగన్ ఎన్నికల ప్రచారంలో మరియు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్లు పరిణామాలు కనబడ్డాయి.
కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఏపీ ప్రజలు మర్చిపోలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా “ప్రత్యేక హోదా” విషయంలో ఏ క్షణంలోనైనా అధికార పక్షాన్ని జగన్ ను ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు తీయడానికి రెడీ గా ఉన్నారు. ఇప్పటికే అనేక విషయాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి చూసిన చంద్రబాబు “ప్రత్యేక హోదా” విషయంలో ప్రజలలో సెంటిమెంట్ రగిలించడానికి రెడీగా ఉన్నారు. రాజకీయంగా ఏదో రీతిలో పైకి రావటానికి చంద్రబాబు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుని అప్పుల్లో ఉన్న రాష్ట్రం బయట పడాలంటే, ధనిక రాష్ట్రం అవ్వాలి అంటే ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని సెంటిమెంట్ రగిలిస్తే, జగన్ ఏం సమాధానం చెబుతారు?, జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.
మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేం అన్నట్టు జగన్ వ్యవహరించడంతో ఇప్పుడు ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో, అదే విధంగా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. జగన్ ఏడాది కాలపు పరిపాలన చూస్తే “ప్రత్యేక హోదా” విషయంలో సాధించింది శూన్యం అని చెప్పుకుంటున్నారు. ఏమైనా రాజకీయపరమైన ఒత్తిడి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతోనే అడగలేకపోతున్నట్టు పేర్కొంటున్నారు. ప్రధాన మోడీ ని కలిసినప్పుడు వినతిపత్రంలో “ప్రత్యేకహోదా” అనేది ఒక అంశం గానే ఉన్నది తప్ప దానికోసం ప్రత్యేకంగా జగన్ చేసిన ప్రయత్నాలు ఏమి కనబడటంలేదు అని నెటిజన్లు తెగ డిస్కషన్స్ చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గాని “ప్రత్యేక హోదా” అంశం అనేది మాత్రం వచ్చే ఎలక్షన్ నాటికి జగన్ ని ఇబ్బంది పెట్టే అంశంగా తయారవుతుందని మేధావులు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి “ప్రత్యేకహోదా” అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చాలాసార్లు ప్రకటన చేయడంతో, రాబోయే రోజుల్లో జగన్ ఏ రీతిలో “ప్రత్యేక హోదా” విషయంలో ప్రజలకు వివరణ ఇచ్చుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది.