‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అనే నానుడిలా తయారైంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. కేసీఆర్ దెబ్బకు టీడీపీ నాయకులు తమ దారి తాము చూసుకుంటూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. చంద్రబాబు ఆ సమయంలో ఏపీలో సీఎం కాబట్టి తెలంగాణలో పార్టీని పట్టించుకునే సమయమే లేకపోయింది. ఆ తర్వాత అసలు తెలంగాణలో టీడీపీ ఉందా..? అనే స్థాయికి వచ్చేసింది. జెండాను నమ్మిన క్యాడర్.. నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ మిగల్లేదు తెలంగాణలో. ఇప్పుడు హైదరాబాద్ లో ‘టీడీపీ భవన్’.. ఓ బిల్డింగ్ మాత్రమే అన్నట్టు తయారైంది పరిస్థితి.
కోలుకోలేని దెబ్బ తీసిన ఆ సంఘటన..
ఓటుకు నోటు కేసు చంద్రబాబును పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఉన్నపళంగా ప్రభుత్వ కార్యాలయాలతో సహా అమరావతి వచ్చేశారు. దీంతో తెలంగాణలో పార్టీని కనీసం పట్టించుకోలేదు కదా.. వదిలేశారు. 2019లో ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ అప్పటినుంచైనా తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిందా అంటే అదీ లేదు. ఏపీ రాజకీయాల్లో తప్ప తెలంగాణ వైపు దృష్టి మరల్చింది లేదు. లాక్ డౌన్ నుంచి హైదరాబాద్ లోనే చంద్రబాబు ఉంటున్నా.. కనీసం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయలేదు. దీనిపై అక్కడి నాయకుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణను మార్చమన్నా అధినేత నుంచి ఉలుకూ పలుకూ లేదు.
ఎన్నికల్లో పోటీ లేదు.. విసిగెత్తిపోతున్న కార్యకర్తలు..
తెలంగాణలో ఏరకంగా పోటీ చేసినా ఇక గెలవమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేసారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1 సీటు మొదలు పార్టీ ప్రాభవం కోల్పోతూనే ఉంది. 2018లో ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలపడం టీడీపీ దీన దుస్థితికి పరాకాష్ట. ప్రస్తుత దుబ్బాక ఉప ఎన్నికలపై కూడా పార్టీ దృష్టి సారించలేదు. అధ్యక్షుడు రమణ ఏ నిర్ణయం తీసుకోలేదు.. అభ్యర్ధిని ప్రకటించ లేదు. కార్యవర్గ సమావేశం కోసం కోర్ కమిటీ చంద్రబాబును కలవాలని ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో తెలంగాణపై వేచి చూసే ధోరణిలో ఉన్నారా.. లేక వదిలేశారా అనే అయోమయంలో ఉన్న ఆ కాస్త క్యాడర్ చర్చించుకుంటున్నారు.