బద్వేల్ : కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు శనివారం టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్ రెడ్డి పార్టీ కండువాను కప్పి జయరాములును సాదరంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా జయరాములు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడగలిగే శక్తి బిజెపికే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని జయరాములు జోస్యం చెప్పారు. బిజెపి అధిష్ఠానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని జయరాములు తెలిపారు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు నుంచి పోటీచేస్తానని జయరాములు పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో జయరాములు వైసిపి తరుపున పోటీ చేసి గెలిచారు. ఎన్నికల అనంతరం జయరాములు వైసిపికి గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి టికెట్ను కేటాయించకపోవడంతో జయరాములు పార్టీకి గుడ్ బై చెప్పారు.
టిడిపి అధినేత చంద్రబాబు మొన్న ప్రకటించిన తొలి జాబితాలో బద్వేలు టికెట్ను ఓబులాపురం రాజశేఖర్కు కేటాయించారు.