Big Breaking: వెలుగొండ ప్రాజెక్టుపై ఇప్పటికే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి, ఆ తరువాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖలు రాసిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసిఆర్ కు ఘాటుగా లేఖ రాశారు. వెలుగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదుని పునః పరిశీలించి, ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు ను అడ్డుకోవద్దని వేడుకున్నారు. ప్రకాశం జిల్లా రైతాంగం బాధ, ఆందోళనను వారి గుండె కోతను తమరి దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఏ జిల్లా పరిస్థితి ఏమిటో తమరికి తెలుసునన్నారు.
సంవత్సరాల తరబడి కరువు ఫలితంగా జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాల సాగుభూమి పూర్తిగా బీడువారిందని పేర్కొన్న ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లా దయనీయ స్థితిని, కరువుని తీర్చే ఏకైక పరిష్కారంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఏపి ముఖ్యమంత్రి చేతగాని తనం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు భవిష్యత్తుకు ముప్పు వాటిల్లిందని విమర్శించారు. పదే పదే ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వ అంతరంగం ఏమిటో? కరువు జిల్లా ప్రకాశంపై కక్ష ఎందుకో ? అర్ధం కావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర కలవరం చెందుతోందన్నారు. 2014 పునర్విభజన చట్టంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆరు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చిన వాటిలో వెలుగొండ ఉన్న సంగతి తమరికి తెలుసున్నారు.
వెలుగొండకు అనుమతులు లేవు, అక్రమ ప్రాజెక్టు అంటే తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి అక్రమ ప్రాజెక్టులు కాదా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ఎటువంటి హక్కులున్నాయో, వెలుగొండకి కూడా అదే హక్కులు, అనుమతులు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు వివరించారు. పదేపదే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడం ప్రకాశం జిల్లా రైతుల కడుపులు కొడుతున్నట్టే అవుతుందన్నారు. ఏపి ముఖ్యమంత్రి మౌనం, మా ప్రభుత్వ చేతగాని తనం ఫలితంగా వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికే కేంద్ర గెజిట్ లో స్థానం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.