భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగే పార్టీ. దీన్ని ఆ పార్టీ నాయకులు పూర్తిగా ఒప్పుకోకున్నా అంతర్గతంగా మాత్రం నిజమని చెబుతారు. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో కాషాయ జెండా ఎగిరేసేందుకు ఇప్పుడు బిజెపి నాయకులు ఇప్పుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కరోనాతో ఇటీవల మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ స్థానానికి త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో బిజెపి తన పదునైన వ్యూహరచనతో గెలుపు ప్రణాళికలను రచిస్తోంది. కచ్చితంగా తిరుపతి ఎంపీ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. గురువారం తిరుపతి వెళ్ళిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో ఆ పార్టీ నాయకులతో పాటు మిత్రపక్షమైన జనసేన నాయకులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని బిజెపి, జనసేన బలాబలాలు, ఉన్న లోపాలు, స్థానిక పరిస్థితులను నాయకుల నడిగి సోము వీర్రాజు తెలుసుకున్నారు. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళితే ఎంపీ సీట్ దక్కించుకోవచ్చు అనేదానిపై మంతనాలు సాగించారు. బీహార్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బిజెపి ఉప ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను సాధించింది. ఇదే ఊపుతో తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా సాధించేందుకు జాతీయ నాయకత్వం సైతం సుముఖంగా ఉంది. దీనిపై వెంటనే స్థానిక నాయకులను రాష్ట్ర నాయకత్వాన్ని సమాయత్తం చేసి తిరుపతి లోక్సభను సాధించేందుకు తగు విధంగా పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని, ఎలాంటి వ్యూహాలు రచిస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నారు.
దుబ్బాక మోడల్!!
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఫార్ములా ను తిరుపతిలో కూడా ఉపయోగించాలని బీజేపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అధికార పార్టీ నాయకులను ఎలాంటి ముప్పు తిప్పలు పెట్టి, బీజేపీ అభ్యర్థి బలాన్ని ఎక్కువ చేసి చూపించారో అదే విధమైన ఫార్ములా తిరుపతి లోను కొనసాగించాలని భావిస్తున్నారు. లేని బలాన్ని ఉన్నట్లుగా చూపడమే కాకుండా, జాతీయ నాయకులను ప్రచారానికి దింపేలా ఆలోచనలు మొదలు పెట్టారు. మరో పక్క జనసేన అధినేత ను తగిన విధంగా వాడుకుని ముందుకు వెళ్లేలా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడెక్కడ బలం ఉంది అనేది ఆలోచిస్తున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో తిరుపతి, శ్రీ కాళహస్తి, నగరి, సత్యవేడుతో పాటు నెల్లూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఉన్నాయి. తిరుపతి శ్రీకాళహస్తి నగరి వెంకటగిరి ప్రాంతాల్లో కాపుల ఓట్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ తో సభలు పెట్టించాలని బిజెపి అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తిరుపతికి చెందిన ఓ స్థానిక నాయకుడు తెలిపాడు. శ్రీకాళహస్తిలో కోలా ఆనంద్ నగిరి నియోజకవర్గంలో బిజెపి రాష్ట్ర నాయకురాలు విధుష తిరుపతిలో భాను ప్రకాష్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ బలంగా ఉన్నారు. మిగిలిన నియోజకవర్గ స్థాయి నాయకులే తప్ప ఫలితం చూపించి అందరిని ఒక తాటి పైకి తీసుకు వచ్చేవారు తక్కువ. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా బిజెపి నాయకత్వం దృష్టి పెడుతోంది. గతంలో బీజేపీ కు బలం గా పనిచేసిన పాత తరం నాయకులను కలిసి అందరిని ఒకతాటిపై తీసుకు వచ్చే వ్యూహరచన చేస్తున్నారు.
దాసరి శ్రీనివాసులే అభ్యర్థి??
మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఎప్పటినుంచో బిజెపి కు అనుబంధంగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీ టికెట్ తిరుపతి కేటాయిస్తే ఆయన రంగంలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు. ఎక్కువగా కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చిత్తూరు జిల్లాకు చెందినవారే. ఢిల్లీలోని బిజెపి పెద్దల తోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గిరిజనులు సంచార జాతుల కు సంబంధించి ఆయన పలు ఉద్యమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. సరమత సేవా సంస్థ ద్వారా కార్యక్రమాలు చేశారు. 2017లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన బీజేపీ లో కీలకంగా వ్యవహరిస్తారని, ఉన్నత విద్యావంతుడు అయిన దాసరి శ్రీనివాసులు బీజేపీ అభ్యర్థి అవుతారని, వివదరహితుడిగా అందరితో అజాత శత్రువుగా ఉంటారని పేరు నివాసులకు టికెట్ ఇవ్వడానికి ఎవరూ అడ్డు చెప్పరని బీజేపీ తరపున కచ్చితంగా ఆయన నిలబడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తిరుపతి నియోజకవర్గం పరిధిలో గట్టి పట్టు ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ను బిజెపి ఎలాంటి ఎదుర్కొంటుంది ? రెండు లక్షల పైగా మెజార్టీ సాధించిన బల్లి దుర్గాప్రసాద్ స్థానాన్ని ఎలా చేజిక్కించుకుంటుంది అనేది వేచి చూడాలి.
ఉనికి ఐనా తెలుస్తుంది కదా..!!
బీజేపీ ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసింది లేదు. ఇప్పుడు జనసేన తో కలిసి పోటీకి సై అంటున్న కమలం పార్టీకి క్షేత్ర స్థాయిలో కేడర్ లేకున్నా పవన్ కరిష్మా పనోచేస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఐతే పవన్ పార్టీకు తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అంత బలం లేదు. కేడర్ లేదు. ఇక దుబ్బాక వరకు వస్తే అక్కడ అభ్యర్థి బలం, కేడర్ పని తీరు ఆ పార్టీకు విజయం తెచ్చాయి. అలాంటి బలం తిరుపతి లో లేదు. అందులో ఒక అసెంబ్లీ స్థానం వేరు. లోక్ సభ స్థానం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏ మాత్రం ఒక నియోజకవర్గ ఓట్లు మొత్తం దెబ్బ పడినా ఓటమి ఖాయం. బలమైన వైస్సార్సీపీ కేడర్, నాయకులు అందులో అధికార బలంలో ఉన్న జగన్ వెవ్ ఎంత మేర బీజేపీ తట్టుకోగలదు. లేదా ఉనికి కోసం ఆరాట పడి పోరాడి, ఉన్న పరువు పొగుట్టుకుంటుంద అనేది త్వరలో తేలనుంది.