జవసత్వాలు పూర్తిగా కోల్పోయిన పార్టీకి కొత్త జోష్ రావాలంటే ఎన్నికలు రావాల్సిందే. ఆ సమయంలో ప్రతి చిన్న పార్టీలో కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో టీడీపీ తన హవా కొనసాగించింది. రెండు రాష్ట్రాలయ్యాక తెలంగాణలో మాత్రం టీడీపీ ఉనికి కోల్పోయింది. అయినా.. తెలంగాణలో అతి త్వరలో జరగబోయే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. కోరలు పీకేసినా.. ఎముకలు విరిచేసినా.. ఒళ్లు గుళ్ల చేసినా.. పసుపు చొక్కా తీసేసినా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పట్ల అభిమానం ఉంది. పార్టీ జెండా చూస్తే పూనకాలు తెచ్చుకునే కార్యకర్తలు ఉన్నారు. వారికి చంద్రబాబు, లోకేశ్ మద్ధతుగా నిలుస్తారా అనేదే ప్రశ్న. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ లో త్వరలో జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల కోసమే.
కార్యకర్తలు సిద్ధమవుతున్నారు..
తెలంగాణ ప్రభుత్వం త్వరలో బల్డియా ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అధికార టీఆరఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. కానీ.. స్థానిక నాయకత్వం, కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలనే తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. తెలంగాణలో దాదాపు కనుమరుగైన టీడీపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకోకపోతే ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నారని అంటున్నారు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో టీడీపీ ఒక సీటుకే పరిమితమైంది.
అందుకే చంద్రబాబు జంకుతున్నారా..
తెలంగాణ ఏర్పడ్డాక టీడీపీలో కార్యకర్తలు తప్ప నాయకులు మిగల్లేదు. చాలామంది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి టీఆర్ఎస్ హవా తట్టుకోలేక తన బద్ద శత్రువైన కాంగ్రెస్ తో చేతులు కలిపింది టీడీపీ. చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో అసలు బలం లేని చోట ఎందుకు పోటీకి వెళ్లడం అని అధినాయకత్వం భావిస్తున్నటు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన టీఆర్ఎస్ 2016లో ఏకంగా 99 సీట్ల సాధించింది. కాంగ్రెస్ రెండు, టీడీపీ 1 స్థానాలకు పరిమితమయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీంతో బల్దియా ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ కు నల్లేరు మీద నడకే అనే వార్తలు వస్తున్నాయి.