COVID third wave: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన కరోనా వైరస్ వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికొందరైతే ఉపాధి కోల్పోవడమే కాకుండా తమ వారిని కూడా కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నారు.
అయితే ఈ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత భారత దేశంలో చాలా మంది మానసిక సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. దేశంలో ప్రతి చోటా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా భారత దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి మానసిక సమస్యలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సెకండ్ వేవ్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వీరిలో చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయి మానసికంగా శల్యం అయ్యారు. కొంతమంది పరిస్థితి మెరుగుపడుతుంది కానీ మరికొంతమంది మాత్రం తీవ్రమైన నైరాశ్యం లోకి వెళ్ళిపోయారు.
అంతే కాకుండా రెగ్యులర్ జీవితం నుండి ఒంటరి జీవితం, కొత్త జీవితం అనుభవిస్తున్న వారి మానసిక స్థితి కూడా మరింత ఘోరంగా తయారైంది. కాబట్టి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక మూడవ వేవ్ కూడా అనివార్యం అన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి అలాగే వ్యాపారంలో భారీగా దెబ్బ తిన్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఆ ఆలోచనలు వారి మెదడులో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అతిఆలోచనలు దూరం చేసుకొని ఈ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.