(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు ఆయన పదవీ కాలం కుదించి తొలగించిన సందర్భంలో ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆయనను విధుల్లోకి చేర్చుకోకపోవడంతో మళ్లీ దిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో గవర్నర్ ఉత్తర్వుల ద్వారా నిమ్మగడ్డ తిరిగి విధుల్లోకి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిఐడీ కేసు విషయంపై నిమ్మగడ్డ మరో మారు హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చు అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేసిందనీ, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదనీ రమేష్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం ఎన్నికల ఎన్నికల కమిషన్కు నిధులు నిలిపివేయడం చట్టవిరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలుగా చేర్చారు.