Huzurabad: ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. ఉప ఎన్నికల షెడ్యూల్ రాకమునుపే ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసిఆర్ కు కుడి భుజంగా ఉండి భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల జాతీయ పార్టీ బీజేపీ తరపున బరిలో దిగుతుండటంతో ఇక్కడ ప్రధాన పోటీ ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఉంటుందని భావిస్తున్నారు.
హుజూరాబాద్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నకారణంగా ఈటల బీజేపీలో చేరారు. అయితే ఆయన నియోజకవర్గంలో సొంత బలం, బలగాన్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. దశాబ్దాల కాలంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా పని చేసినందున తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలు ఆదరిస్తారని ఈటల భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తనకు చేసిన నష్టాన్ని జనం గమనించారని, తనపై సానుభూతి చూపుతున్నారని అంటున్నారు ఈటల. ఎన్నికల షెడ్యుల్ రాకమునుపే ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ జనాలను కలుస్తున్నారు.
మరో టీఆర్ఎస్ అధినేత, కేసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈటలను ఓడించి మళ్లీ హుజూరాబాద్ లో గులాబీ జెండా రెపరెప లాడించాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యనేతలు ఎవ్వరూ ఈటల వైపు వెళ్లకుండా చర్యలు చేపడుతోంది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీలో బలమైన యువనేతగా ఉన్న కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఈ ఉప ఎన్నికల వ్యూహంలో భాగంగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత మోతుకుపల్లి నర్శింహులు వంటి వారిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
టీఆర్ఎస్ వర్సెస్ ఈటల పోటీలో ఓట్ల చీలిక వల్ల తమ లాభం చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా ఎవరు గెలుస్తారు అనే దానిపై తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
మరో పక్క ఉప ఎన్నికలపై పలు సర్వేలు కూడా వస్తున్నాయి. ఇటీవల తీన్మార్ మల్లన్న ఓ సర్వే వివరాలు వెల్లడించారు. ఈటల విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా తాజా ఓ సర్వే వివరాలు వైరల్ అవుతున్నాయి. ఈ సర్వేలోనూ ఈటలకే మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది.