ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కాలనీలు చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఇల్లల్లో చేరిన నీరు ఇంకా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వరద బాధితులకు 10000 రూపాయల చొప్పున నగదు సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఈ వరద సాయంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి పంచాయతీ లేకపోయినా, బాధితులకు నగదు అందజేసే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల హడావిడి తప్పు పడుతోంది కాంగ్రెస్.
ఈ అంశం లోనే ఇప్పుడు గ్రేటర్ పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. వరద బాధితులకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటిస్తే ఆ సహాయాన్ని…. బాధితులకు అధికారులు అందజేయాలి. కానీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు… ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది. త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సహాయాన్ని వారి ప్రచారానికి వాడుకుంటున్నాట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. చెక్కులను ఇవ్వటమే కాకుండా నవ్వుతూ ఇవ్వడంపై కూడా తప్పు పడుతోంది విపక్ష పార్టీ. అంతే కాకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వరద సహాయం అందుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఈ విధంగా వరద సహాయాన్ని అడ్డంపెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలలో గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శ.