చిన్నల్లుడు భరత్ కి చెందిన విశాఖపట్నం లోని గీతం యూనివర్శిటీ పై వైసిపి ప్రభుత్వం పంజా విసిరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటి వరకు బాలయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని ఢీకొనే ప్రయత్నం చేయలేదు.పెద్దగా వైసిపి సర్కారుపై ఆయన ధ్వజమెత్తిన సందర్భాలు కూడా లేవు.తెలుగుదేశం పార్టీలో తన పని తాను చేసుకుపోవడం తప్పితే రాజకీయంగా ఆయన కీలక పాత్ర పోషించిన దాఖలాలైతే కనిపించడం లేదు.కానీ ఇప్పుడు స్వంత అల్లుడికి చెందిన విద్యాసంస్థల విషయంలోనే ఇబ్బంది వచ్చినందున ఆయన ఎలా దీన్ని డీల్ చేస్తారన్నది చర్చ గా మారింది.
నిజానికి బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన సందర్భంగా అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆయనను కాపాడా రంటారు ఆ కేసులో బాలయ్య కనీసం అరెస్టు కాలేదు .జైలుకు కూడా వెళ్లలేదు.నిర్దోషిగా విడుదలయ్యారు. పోలీసుల సహకారం ఉంటే తప్పితే ఆ కేసు అంత సులువుగా తేలిపోయేది కాదన్నది వాస్తవం. ఇక జగన్ విషయానికొస్తే ఆయన నందమూరి బాలకృష్ణ అభిమాని అని ఒక ప్రచారం ఉంది. సమరసింహా రెడ్డి సినిమా సూపర్ హిట్ అయినప్పుడు బాలయ్య అభినందన తెలుపుతూ జగన్ ఇచ్చిన పత్రికా ప్రకటనను ఇప్పటికీ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెడుతుంటారు.ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య జగన్ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొని ఉందని టాక్. అయితే ఉన్నట్లుండి గీతం యూనివర్శిటీ అక్రమంగా ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని పేర్కొంటూ విశాఖ మున్సిపల్ అధికారులు గీతం నిర్మాణాలను కూలగొట్టిన సంగతి తెలిసిందే. ఆక్రమించుకున్న భూమి విలువ 800 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు .
ఇంతటితో ఆగకుండా యూనివర్సిటీ భూములను వెనక్కు తీసుకోవటం తో పాటు ఆ యూనివర్శిటీ కార్యకలాపాలపై కూడా విచారణ జరిపించే ప్రయత్నాలు జగన్ ప్రభుత్వం చేస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవన్నీ కక్షపూరిత చర్యలంటూ ఆకర్శిస్తున్నప్పటికీ బాలయ్య మాత్రం ఇప్పటికీ నోరు మెదపలేదు.అయితే ఇది సొంత అల్లుడి వ్యవహారం కాబట్టి బాలయ్య మౌనంగా కూర్చోబోనని చెబుతున్నారు.కానీ ఆయన జగన్ ప్రభుత్వంపై పోరాటానికి దిగుతారా లేకుంటే లోపాయికారిగా ఈ విషయాలను సర్దుబాటు చేసుకుంటారా అన్న విషయంలో మాత్రమే క్లారిటీ రావలసి ఉంది.ఇది చాలా సున్నితమైన వ్యవహారం కాబట్టి బాలయ్య ఏ అడుగు వేసినా అటు వైసిపి పరంగానో…ఇటు టీడీపీ పరంగానో కౌంటర్ లుఎదుర్కోవలసి ఉంటుంది మరి ఆయన ఏం చేస్తారన్నది చూడాలి.