సీఎం జగన్మోహన్ రెడ్డికి అక్టోబర్ నెల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఇప్పటి వరకు తాను కలలు గన్న రాజధాని తరలింపు, తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఈ రెండు కూడా అక్టోబర్ నెలలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మదిలో అక్టోబర్, అక్టోబర్ అంటూ మెదులుతోంది. ఎందుకు? విషయం ఏమిటి అనేది ఆరా తీసుకుంటే..
రాజధాని శంకుస్థాపన అక్టోబర్ లోనే
విశాఖలో రాజధాని శంకుస్థాపన ఈ నెల 16వ తేదీ అని అనుకున్నారు. కానీ అధికారికంగా ఖరారు చేయలేదు. రాజధాని తరలింపునకు సంబంధించి ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడం, 14వ తేదీ ఆ కేసు వాయిదా కావడం, హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించినా అది విచారణ దశకు రాకపోవడం, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దీనిపై ఆలోచించారు. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీనితో 16వ తేదీ శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేయడం కష్టమని భావిస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ తరువాత ముహుర్తాలు అంతగా బాగోలేనందున అక్టోబర్ లో మంచి ముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ రెండవ వారంలో రాజధాని శంకుస్థాపన ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోడీ ని ఆహ్వానించాలని సీఎం వై ఎస్ జగన్ అనుకుంటున్నారట. ఈ లోపుగా జగన్ ఢిల్లీ వెళ్లి నేరుగా ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించనున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అప్పుడే
సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడుతూ వస్తున్నది. నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీ ఈ ఏడాది మార్చి 15వ తేదీ అనుకున్నారు. తరువాత ఉగాది అనుకున్నారు. అవ్వలేదు, మే నెల అనుకున్నారు, కుదరలేదు. జూన్ నెల అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఆగస్టు 15న అనుకుంటున్నారు అది అయ్యేదిగా లేదు. తొలుత ఎన్నికల కోడ్, తరువాత పలు చోట్ల వివాదాలు, కోర్టు కేసులు, ఈ తరుణంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం తదితర కారణాల వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. పలు నియోజకవర్గాలలో భూ సేకరణకు సంబందించి అవినీతి ఆరోపణలు రావడం, వివాదాలు జరుగుతుండటంతో అక్టోబర్ నాటికి ఈ వివాదాలు అన్నీ పరిష్కరించాలన్న భావనలో అధికార యంత్రాంగం ఉంది. అక్టోబర్ రెండున ఇళ్ల పట్టాల పంపిణీ ఖచ్చితంగా నిర్వహించాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కీలకమైన రాజధాని శంకుస్థాపన, ఇళ్ల పట్టాల పంపిణీ రెండు కార్యక్రమాలు అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉండటంతో జగన్ కు ఆ నెల ఇంపార్టెంట్ గా మారింది.