Vizag steel ..ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై వల వేస్తున్న రాజకీయ పార్టీలు ఎవరు.. వలలో చిక్కుకుంటోంది ఎవరేనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికలతో హోరెత్తిన ఏపీ రాజకీయం ఇప్పుడు వైజాగ్ కు షిఫ్ట్ అయింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు, ఆందోళనలు, ఉద్యమాలతో విశాఖ సముద్ర ఘోషను తలపిస్తోంది. విశాఖ ప్లాంట్ ను కాపాడుకోవాలనో..కార్మికుల శ్రేయస్సు కోసమో..నాయకుల స్వలాభం కోసమో.. పార్టీల ఉనికి కోసమో కానీ.. ఎవరి ఆట వారు ఆడేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాల్లో ఏ మీడియాను, ఏ పార్టీని నమ్మాలో తెలీని పరిస్థితి నెలకొన్నట్టు.. విశాఖ ఉక్కు అంశంలో ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో తెలీని అయోమయం నెలకొంది. సీఎం జగన్ ఏపీ రాజధానిని ఇంకా విశాఖకు తరలించకుండానే ప్రస్తుతం రాజకీయం అంతా విశాఖలో కొలువుదీరింది.
Vizag steel లో పార్టీల ఆట మొదలయింది..
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు.. ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు.. అన్నీ జయహో విశాఖ ఉక్కు అని కీర్తిస్తున్నాయి. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ ఉద్యమిద్దాం అంటూ పిలుపిచ్చారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోయేదేమీ లేదు.. ప్రాణాలు తప్ప అంటూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. గంటా శ్రీనివాసరావు..పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే పల్లా దీక్షకు సంఘీభావం ప్రకటించారు.బీజేపీ నాయకులు ఏం మాట్లాడాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. సీపీఐ, సీపీఎం.. ఎవరు వింటే మాకేంటి.. వినకపోతే మాకేంటి అంటూ స్వతహాగానే గొంతెత్తి నినదిస్తున్నాయి. ఎటొచ్చీ జనసేన మాత్రం.. ఓ అడుగు ముందుకేసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాకు వినతిపత్రం ఇచ్చారు. (తమ తిరుపతి ఉప ఎన్నిక సీటు గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశం ఉందా అనేది చెప్పలేం) ఇలా.. మొత్తం విశాఖ ఉక్కును మధ్యలో కూర్చోబెట్టి ఏపీ రాజకీయ పార్టీలన్నీ మ్యాజిక్ చైర్ ఆడేస్తున్నాయి. అయితే..
కేంద్ర మంత్రి వెల్లడించిన నిజాలు..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని చెప్పిన కేంద్ర ప్రభుత్వమే.. ఇందుకు ఎప్పుడు అడుగులు పడ్డాయో కూడా చెప్పింది. కేంద్ర పెట్రోలియం, గ్యాస్, స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇదే విషయాన్ని రాజ్యసభలో సుష్పష్టంగా చెప్పుకొచ్చారు. ‘2018 అక్టోబర్ 22న పోస్కో, హ్యుందాయ్ విశాఖలోని RINL ప్లాంట్ ను సందర్శించింది. 2019 జూలై, 2020 సెప్టెంబర్ నెలల్లో పోస్కో మలివిడత RINL ను సందర్శించింది. స్టీల్ ప్లాంట్ కు చెందిన మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది పోస్కో ఆలోచన.అందుకే ఈ పర్యటనలు చేసింది.మొత్తంగా 2019 అక్టోబర్ లో పోస్కో – RINL మధ్య ఎంఓయూ కుదిరింది. ఇంకా ఎవరి వాటా ఎంత అనేది తేలలేదు. 50 శాతం వాటా కావాలనేది పోస్కో కోరుకుంటోంది’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇప్పుడీ సమాధానమే కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది.
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్
సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న ఆరు నెలల తర్వాత రాజధానిని విశాఖకు తరలిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇది జరిగింది 2019 నవంబర్ నెల అసెంబ్లీ సమావేశాల్లో. కానీ.. నెల ముందే అక్టోబర్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి నిర్ణయం జరిగింది. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఖాళీ భూముల్లో ప్రైవేట్ పరిశ్రమ నిర్మాణానికి పోస్కో రెడీ అయింది. దీనిపైనే సీఎం జగన్ తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎంఓయు కూడా కుదిరింది. కేంద్రమంత్రి వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే..ఇందుకు విత్తనం ఎప్పుడో పడిందని అర్ధమవుతోంది. ఎక్కడో పెద్ద తప్పు జరుగుతోందని అనిపిస్తోంది. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు పరం చేసారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్ వంతు వచ్చిందా.. ఈయన కూడ అందుకు ఊపిరి పోస్తున్నారా అనే సందేహం రాకపోదు. మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటు నిర్ణయం తమది కాదు.. ఏపీది అని బీజేపీ చెప్పకనే చెబుతోందని చెప్పాలి.