ఔను.. ఇప్పుడు అనకాపల్లిలో ఈ మాటే వినిపిస్తోంది. ఇక్కడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగు తున్న ఒకప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. వ్యక్తిగతంగా మంచి నాయకుడనే పేరు వస్తోంది. అయితే.. ఇదేసమయంలో ఆయన చేస్తున్న రాజకీయం మాత్రం బాగోలేదని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రమేష్.. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. పైగా వెలమ నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చారు.
అయితే.. రమేష్కు అనకాపల్లి నాన్ లోకల్ కావడంతోపాటు.. ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఆయనకు కొత్త కావడం గమనార్హం. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ను ఏరికోరి మరీ ఇక్కడకు తెచ్చారు. అయితే.. దీనివెనుక.. టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందనేది బహిరంగంగానే జరుగుతున్న చర్చ. ఇది టీడీపీ నేతలను రమేష్కు కనెక్ట్ కాకుండా చేస్తోంది. అనకాపల్లి టికెట్ను ప్రకటించి.. నాలుగు రోజులు అయినా.. ఇక్కడ ఎలాంటి రాజకీయ దూకుడు కనిపించడం లేదు.
అలా కాకుండా .. జనసేన లేదా.. టీడీపీ నుంచి ఎవరిని ప్రకటించినా ఆ ఊపు వేరేగా ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక, వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా.. మంత్రి బూడి మూత్యాల నాయుడుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా టికెట్ ఇచ్చారు. ఈయన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పైగా.. లోకల్. దీంతో ఈయనను వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అందునా.. తమకు అందుబాటులో ఉండే నాయకుడనే పేరు కూడా ఉంది.
దీంతో అనకాపల్లి సీటు విషయంలో ఎన్నికలు జరగకుండానే.. బూడి గెలుపు ఖాయమని అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. అనకాపల్లిలో మార్పు లేదనే టాక్ వినిపిస్తుండం గమనార్హం. పైగా.. రమేష్ గురించి.. ఇక్కడి మాస్ జనాలకు తెలియదు. ఆయన చెబుతున్న మాటలు విన్నా.. ప్రజలు కొట్టి పారేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటానని చెప్పారు. కానీ, మూడేళ్లుగా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగులు నిరసన చేస్తున్నా.. ఒక్క సారి కూడా రమేష్ రాలేదు. పార్టీలకు అతీతంగా ఆయన స్పందించింది కూడా లేదు. పోనీ.. ఇక్కడ గంటాకు టికెట్ ఇచ్చి ఉన్నా.. సునాయాశంగా ఈ సీటు గెలిచేదనే వాదన వినిపిస్తోంది.