టిఆర్ఎస్ సర్కార్ లో రెండవ సారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న ఈటల రాజేందర్ పరిస్థితి నేడు చాలా దారుణంగా ఉందని ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ మంత్రి వర్గంలో తొలి సారి ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండవ సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెలను దురదృష్టం వెంటాడుతున్నది. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడంతో ఈటెలకు మంత్రి పదవి దక్కదని కూడా ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో కెసిఆర్ ఈటెలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆయన గతంలో నిర్వహించిన ఆర్ధిక శాఖ కాకుండా వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు కేసీఆర్.
ఈటెల సమర్ధవంతంగా పనిచేయడం లేదనీ, లీకులు ఇస్తున్నారనీ తెరాస ప్రభుత్వ అనుకూల పత్రికలో అయన గురించి వ్యతిరేక వార్తలు రావడం, ఆయన హయాంలోనే డెంగ్యూ, చికున్ గున్యా ప్రబలి చాలా మంది మృతి చెందడం, ఈఎస్ఐ, మందుల కొనుగోలు కుంభకోణాలు వెలుగులోకి రావడం ఇలా అన్నీ ఈటెలకు శరాఘాతం అయ్యాయి. ఈ క్రమంలో ఈటెలను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ విజృంభిస్తుండటం వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఈటెలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట.
ఈ తరుణంలోనే టీపీసీసీ వర్కింగ్ పెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక బాంబ్ పేల్చారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి బాద్యుడిగా చేసి ఈటెల మంత్రి పదవికి ఉస్టింగ్ చేయబోతున్నారంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తనకు టీఆర్ఎస్ లోని మిత్రుడే చెప్పాడని రేవంత్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.