Social Media Case: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సీబీఎన్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ లో అసత్య వీడియోలు పెట్టారన్న అభియోగంపై గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు యువకులను ఎట్టకేలకు స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. విజయసాయి రెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో పలు వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన నేరంపై మద్దినేని వెంకట మహేష్ బాబు, ముల్పురి శ్రీసాయి కళ్యాణ్ లను పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ డీజీపీకి లేఖ రాయడం, మరో పక్క ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేయడంతో గుంటూరు పోలీసులు బుధవారం సాయంత్రం వారికి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.
తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మహేష్ మీడియాకు వెల్లడించారు. తమను తీవ్ర వాదుల మాదిరి ముఖాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని తప్పు బట్టారు. ఏడు సంవత్సరాల లోపు నేరాలకు సంబందించిన కేసులో అవసరమైతేనే కోర్టుకు పెట్టాలనీ లేకుంటే స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ శ్రేణుల ఫిర్యాదులపై తక్షణం అరెస్టు చేస్తున్న పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.