ఢిల్లీ, జనవరి 25: ఈబిసి రిజర్వేషన్ల చట్టంపై స్టే (మధ్యంతర ఉత్తర్వులు) ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
కోటా బిల్లుపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. స్టే ఇవ్వకపోయినా, సమస్య తీవ్రత దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు.
అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి చట్ట బద్ధత కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసింది.
ఈ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.