అమరావతి : ‘అనుకున్నదొక్కటి అయిన దొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అనే పాట అందరూ వినే ఉంటారుగా? విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలుచేయాలని ప్రయత్నించిన టీడీపీ..అయన చేసిన తప్పు సాక్షాలతో వెలుగులోకి వస్తుండటంతో బొక్క బోర్లా పడిందని అంటున్నారు వైసీపీ శ్రేణులు.
ప్రభుత్వ ఆసుపత్రులకు కరోనా వైరస్ కిట్లు, రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నట్లుగా సుధాకర్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం, దీనిపై ప్రభుత్వం సీరియస్ అవ్వడం, ఆ తరువాత క్రమశిక్షణ చర్యలలో ఆయనను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆ తరువాత విశాఖ విధుల్లో మద్యం సేవించి ప్రజలను ఇబ్బంది కలిగించే విధంగా ఆయన వ్యవహరించడంతో పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అడువులోకి తీసుకుని మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వ్యవహారాన్ని టీడీపీ కోర్టు వరకు తీసుకువెళ్లింది. దీనిపై హైకోర్టు సిబిఐ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై సిబిఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, ఈ వ్యవహారంలో సుధాకర్ తప్పు కూడా ఉందనీ, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి రావడమే కాకుండా, ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి వంటి వారిని దూషించడం, వంటి వాటికి ఆయన పాల్పడ్డారనీ గుర్తించారుట. లభించిన సాక్షాల ఆధారంగా సిబిఐ ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీనితో ఇప్పటి వరకు సుధాకర్ ను వెనకేసుకుని వచ్చిన టిడిపి ఆయన విషయంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియక డోలాయమానంలో పడిపోయిందట.
బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ పెద్దలను దూషించడం నేరమే అవుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు సిబిఐ సంపాదించడంతో సుధాకర్ వ్యవహారంలో అతిగా స్పందించామనే అభిప్రాయం ఇప్పుడు టిడిపి వర్గాల్లో మొదలైంది. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నిస్తే ఒక్క సారిగా పరిస్థితి రివర్స్ అయిందన్న అభిప్రాయం ఇప్పుడు టీడీపీ నేతల్లో కలుగుతోంది. ఇటీవల జరిగిన టిడిపి మహానాడులోనూ సుధాకర్ వ్యవహారాన్ని పదేపదే చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఈ కేసు ఖచ్చితంగా తమకు లాభం చేకూరుస్తుందని టీడీపీ భావించగా సిబిఐ రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం రివర్స్ అవ్వడంతో ఇక సైలెంట్ గా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి టీడీపీ వచ్చిందట.