ఏపీలో ఇప్పటివరకూ మూడు రాజధానులు, స్థానిక సంస్థల ఎన్నికలు, హిందూ దేవాలయాలపై దాడులే హీటెక్కించాయి. ఇప్పుడు మరో అంశం సంచలనంగా మారింది. న్యాయవస్థల్లోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులను ఎలా ప్రభావితం చేయచ్చో అనే అంశంపై న్యాయవ్యవస్థకే చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఇది. కొన్నాళ్ల క్రితం.. జస్టిస్ ఈశ్వరయ్య, జడ్జి రామకృష్ణ మధ్య జరిగిన సంభాషణ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలసిందే. దీంతో వివాదం హైకోర్టుకు వెళ్లింది. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారనే అంశంపై జస్టిస్ ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు విన్న హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందే అని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించింది. జస్టిస్ ఈశ్వరయ్య తరపున ప్రశాంత్ భూషణ్, వ్యతిరేకంగా కపిల్ సిబాల్ వంటి ఉద్దండులు వాదిస్తున్న ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏపీ ప్రభుత్వంపై కుట్ర జరిగిందా..?
ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాలూ హైకోర్టు గడప తొక్కుతున్నయి. ఇందులో ప్రతిపక్షాలు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. అయితే.. ప్రతి అంశంలోనూ ప్రభుత్వానికి తీర్పులు, ఆదేశాలు వ్యతిరేకంగా రావడంపై ఒక దశలో ఏపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ కూడా సహనం కోల్పోయారనే చెప్పాలి. అయితే.. ఇందులో ఏదో కుట్ర ఉందని భావించిన ప్రభుత్వం ఏపీ హైకోర్టు తీర్పులను కొందరు ప్రభావితం చేస్తున్నారంటూ ఏకంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డేకు ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎలా ప్రభావితం చేయొచ్చు.., తీర్పులను ప్రభావితం చేసే అంశాలపై జస్టిస్ ఈశ్వరయ్య, జడ్జి రామకృష్ణ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ అంశం లీక్ అయింది. అయితే.. జస్టిస్ ఈశ్వరయ్య తన పదవీ విరమణ అనంతరం ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వమే జడ్జిలను ప్రభావితం చేసే అంశంపై ఈశ్వరయ్యతో మాట్లడించిందని హైకోర్టులో కేసు దాఖలైంది. అక్కడి నుంచి మొదలైన యుద్ధం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద ఉంది.
జస్టిస్ ను మరో జస్టిస్ ట్రాప్ చేశారా..?
అయితే.. అసలు ఈ విషయంలో జస్టిస్ ఈశ్వరయ్యకు మొదట ఫోన్ కాల్ చేసింది జడ్జి రామకృష్ణ అనే వాదన ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులపై జస్టిస్ ఈశ్వరయ్య వద్ద ప్రస్తావించి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కించపరిచే వ్యాఖ్యలు చేసారని.. చేసేలా జడ్జి రామకృష్ణ నెమ్మదిగా ఈశ్వరయ్యను ట్రాప్ లోకి దించినట్టు వార్తలు వచ్చాయి. ఆయనతో ఉన్న చనువుతో జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలు జడ్జి రామకృష్ణే స్వయంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ ను న్యాయపరంగా ఇరికించడమే ప్రధాన అజెండా అన్నట్టు ఈ కేసు అత్యంత సంచలనంగా మారింది. కొన్ని మీడియా సంస్థలుకూడా హైకోర్టు జడ్జిలపై ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వార్తలు వడ్డించాయి. జడ్జి రామకృష్ణతో ఉన్న చనువు మేరకు లోగుట్టును మాటగా మాట్లాడిన ఈశ్వరయ్య ఇందులో ప్రధాన దోషిగా నిలవడం.. ఇందుకు ప్రధాన వ్యూహకర్తగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. దీంతో రీసెంట్ గా దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
సుప్రీంకోర్టు విచారణ ఇదే..!
సుప్రీంకోర్టు ఇటివల ఈ కేసుపై విచారించింది. ఈశ్వరయ్య తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణగా వ్యాఖ్యానించారు. మొదట సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్ధించింది. కానీ.. కపిల్ సిబాల్ వాదిస్తూ.. అయితే.. న్యాయవ్యవస్థపై ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకుంటామా.. అంటూ ఓ ప్రశ్న లేవనెత్తారు. దీంతో సుప్రీం ప్రశాంత్ భూషణ్ ను ప్రశ్నిస్తూ.. ఇద్దరి మధ్య న్యాయవ్యవస్థ మధ్య జరిగిన చర్చగా మీరు అంగీకరిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. అవుననే సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు.. అయితే.. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించింది. దీనిపై విచారణ అవసరమే అంటూ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఒకరకంగా జస్టిస్ ఈశ్వరయ్య ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు జడ్జి రామకృష్ణ తెలివిగా వ్యవహరంచారనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోందో చూడాల్సిందే. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపించిన ఏపీ ప్రభుత్వానికి ఈ కేసు కాస్త ఇబ్బందిగా పరిణమించిందనే చెప్పాలి.