రాష్ట్రంలో కాపు ఉద్యమం మరోసారి ఊపిరి పోసుకోనుందా! ముద్రగడ తర్వాత కాపులకు నాయకత్వం వహిస్తూ.. ఉద్యమాలు చేస్తూ.. కాపులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే నాయకుడు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపులపైనే పోరాడతారా..? లేదా బలిజల తరపున పోరాడతారా అనేది కీలకం. నేడు ఓ భేటీ జరగనుంది. ఈ భేటీకి వంగవీటి రాధా, ఓవీ రమణ నాయకత్వం వహించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.
జగన్ కు వ్యతిరేకంగా పావులేనా..
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఏపీలో టీడీపీ అధినేత అప్పటి సీఎం కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించారు. జగన్ సీఎం అయ్యాక ఈ బిల్లు అమలుకు నోచుకోలేదు. ఈ బిల్లును అమలు చేయాలని కోరుతూ వీరు ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకోవడంతో ఎవరు ఇందుకు నేతృత్వం వహిస్తారనే ప్రశ్నలకు రాధా రూపంలో సమాధానం వచ్చేట్టు ఉంది. మరి రాధా తన శైలి, తీరుతో ఉద్యమాన్ని ఏమేరకు ముందుండి నడిపిస్తారో ప్రశ్నార్ధకమే. అయితే.. ఇదంతా రిజర్వేషన్ కోసమా సీఎం జగన్ కు వ్యతిరేకంగా జరుగుతోందా అనేది తెలియాల్సి ఉంది.
ఉద్యమం వెనుక చంద్రబాబు ఉన్నట్టా లేనట్టా..
ఈ ఉద్యమం వెనుక సూత్రధారి చంద్రబాబేనా.. అనే ఊహాగానాలు లేకపోలేదు. ఇప్పటికే రాజధాని అంశంలో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే.. ఉద్యమం మాత్రం జరిగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.