కేంద్ర హోం శాఖ నిర్ణయం..వైసీపీ విస్మయం..ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయా…!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు మేరకు కేంద్ర హోం శాఖ స్పందించింది. వైసీపీలోనే ఉంటూ పార్టీని విమర్శించటం పైన సొంత పార్టీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆయన పైనా రాజకీయం గా విమర్శలు తిప్పి కొట్టారు. అదే సమయంలో రఘురామ రాజు పైన కొందరు ఎమ్మెల్యేలు..మంత్రి రఘునాధరాజు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. దీంతో..వీరి వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని..తన భద్రతకు ముప్పు ఏర్పడిందంటూ రఘురామారాజు జూన్ 18న లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. అందులో తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. దీనిని కేంద్ర హోం శాఖకు స్పీకర్ ఎండార్స్ చేయటంతో పలుమార్లు రఘురామ రాజు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు.
రక్షణ అంశం రాష్ట్ర పరిధిలోనిది అయినా కేంద్రం ఇప్పుడు వై కేటగిరీ భద్రత కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీని పైన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కోర్టులో విచారణకు ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీని పైన కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిందా…లేక రఘురామరాజు ఫిర్యాదు మేరకు నిర్ణయం తీసుకుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది..రఘురామ రాజు కోరుకున్నదని సాధించారా..వైసీపీ అధినాయకత్వంతో విభేదించిన రెబల్ ఎంపీ రఘురామరాజు తాను కోరుకున్న విధంగా కేంద్రం నుండి తనకు రక్షణ పొందే విధంగా ఒప్పించగలిగారు. ఏపీలో మంత్రితో సహా ఎమ్మెల్యేలు తన పైన ఫిర్యాదులు చేయటం..వారి అనుచరులు తన దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్న పరిస్థితుల్లో తనకు భద్రత కల్పించాలని రఘురామరాజు స్పీకర్ ద్వారా కేంద్ర హోం శాఖను కోరారు.
దీని పైన తర్జన భర్జనల తరువాత కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భద్రతకు సంబంధించి ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలవటంతో పాటుగా ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన ఈ రోజు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయించిందని..ఇదే విషయాన్ని ఈ రోజు కోర్టుకు నివేదించనుందని తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ప్రభుత్వాన్ని..ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే విధంగా అనేక అంశాల పైన రఘురామరాజు బహిరంగ లేఖలు రాస్తున్నా ఆయన పైన ఎటువంటి క్రమశిక్షణా చర్యలు ఇప్పటి వరకు పార్టీ నుండి తీసుకోలేదు.
రఘురామరాజు తన పైన పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. రఘురామరాజు కోరినట్లుగా కేంద్రం రక్షణ కల్పించటం..ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా మారుతోంది.వైసీపీ విస్మయం…రెండో వ్యక్తికి ఇలా..గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ సైతం రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలోనూ ఆయనకు భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది.
భద్రత కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనా కేంద్రం అప్పుడు నిమ్మగడ్డ..ఇప్పుడు రఘురామారాజు విషయంలో వెంటనే స్పందించటం పైన వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రఘురామారాజు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో తప్పని స్థితిలో కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయించిందనేది పార్టీ నేతల వాదన. అయితే, రఘురామరాజు పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇచ్చిన పిటీషన్ లో భాగంగా ఒక అంశం పైనే ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఆయన సీటు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు పార్టీ ద్వారా వచ్చిన సబార్డినేట్ కమిటీ ఛైర్మన్ పదవి విషయంలోనూ..అదే విధంగా అనర్హత వేటు పైన ఇంకా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు, కేంద్ర హోం శాఖ రఘురామ రాజుకు భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయం పైన వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.