ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీ పార్టీ పేరు వినబడుతోంది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ని ఆ పార్టీ హైకమాండ్ నియమించడంతో చాలా విషయాలలో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా త్వరలో ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ బిజెపి నేతలు చేసిన పనికి కామెడీ కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ప్రధాని మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు రాష్ట్రంలో ఇచ్చింది గోరంత అయితే ప్రచారం కొండంత అన్న తరహాలో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సేవా సప్త హాల్ లో ఏపీ బీజేపీ నాయకుల హడావుడి చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారట. వారు చేసిన సాయం చూసి నోళ్లు తేలేశారట. సేవా సప్త హాల్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆసుపత్రిలోని గర్భిణీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముందే ప్రకటించిన పార్టీ నేతలు… హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేపట్టి వైద్యులకు అదేవిధంగా గర్భిణీలకు షాక్ ఇచ్చినట్లు చేశారు. పార్టీ హైకమాండ్ ఈ కార్యక్రమం ప్రకటించడంతో పాటు ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా పాల్గొనటంతో మొదటిలో మీడియా మరియు చాలామంది… ఈ కార్యక్రమం పై అంచనాలు భారీ ఎత్తున పెట్టుకున్నారు.
అయితే పండ్ల పంపిణీ కార్యక్రమం తీరు చూస్తే పూర్తిగా ప్రచారం కోసమే సేవ అన్నట్లు ఉంది. ఏకంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేతుల మీదగా ఒకో గర్భిణీకి రెండు పండ్లు, రెండు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇవి తీసుకున్న గర్భిణీలు దీనికా ఇంత హడావిడి, అని అంటున్నారట. ఏకంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వస్తున్నారని అనటం తో చాలామంది బాలింతలకు ఫుడ్ మార్కెట్ లాంటి వో, పిల్లలకు ఇతర బేబీ కిట్లు లాంటివో ఇస్తారని అంతా భావించారు. అయితే గుంపులుగా ఆసుపత్రిలోకి ఏపీ బీజేపీ నాయకులు వచ్చి ఒకో బెడ్ పై రెండు ఆపిల్స్, రెండు బిస్కెట్ ప్యాకెట్ లు పెట్టి సరిపుచ్చడం తో విమర్శలు భారీ స్థాయిలో వచ్చాయి. అదనంగా మాస్కు, శానిటైజర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇదంతా చూసిన ఆసుపత్రి వర్గాలు మరియు బాలింతల బంధువులు దీనికే ఇంత హడావిడా అంటూ విమర్శలు చేసినట్లు వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి.