చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజనీ మరో వివాదంలో చిక్కుకున్నారు.పార్టీకి తాను అతీతం అన్నట్లు తాను వైఎస్సార్ జగన్ కంటే గొప్ప దాని అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఉందని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సందర్భంగా విడదల రజినీ అభిమానులు వేసిన ఫ్లెక్సీల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు లేకపోవడం వివాదం రేపడం తెలిసిందే.మరిక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా లేకుండా ఆమె ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంతో వైసిపి శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పథకాల్లో అంబులెన్స్ వ్యవస్థ ఒకటి! దాదాపు 1088 అంబులెన్స్ లను ఏపీ ప్రజల కోసం ఇటీవలే ప్రారంభించి అన్ని నియోజకవర్గాలు – మండలాలకు పంపారు ఏపీ ముఖ్యమంత్రి. దీంతో… ప్రజారోగ్యం విషయంలో శ్రద్ధ చూపించడంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తో కొడుకు పోటీపడ్డారని ప్రశంసలు కురిసాయి. అలాంటి సమయంలో తాజాగా 108 అంబులెన్స్ వ్యవస్థకు పురుడుపోసిన రాజశేఖర్ రెడ్డి బొమ్మ లేకుండా,ఆ వ్యవస్థకు మరిన్ని మెరుగులు దిద్దిన ప్రస్తుత సిఎం జగన్ ఫోటో లేకుండా వైకాపా ఎమ్మెల్యే విడదల రజనీ ఈ అంబులెన్స్ సర్వీసులను సోమవారం చిలకలూరిపేటలో ప్రారంభించటం వైసిపి వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది
108వాహనాలను వైఎస్సార్, వైఎస్ జగన్ ల ఫొటోలు లేకుండా కేవలం ఎమ్మెల్యే రజని తన ఫొటో మాత్రమే ఫ్లెక్సీలో పెట్టుకొని ప్రారంభించడంపై చిలకూరిపేట ప్రజలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కార్యక్రమాన్ని వైఎస్ఆర్ – జగన్ ఫొటోలు లేకుండా ఎలా మొదలుపెడుతారని.. ఇది ఆమె సొంత వ్యవహారం కాదనే విషయం గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు!!
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ప్రజా రోగ్యంపై చూపించిన శ్రద్ధకు సాక్ష్యంగా నిలిచిన 104 – 108 వ్యవస్థ ఒకటి! వారిద్దరూ మైకులు పట్టుకుని… “ప్రజలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లో కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్సులు రావాలి.. వస్తాయి” అని చెప్పిన మాట ఒక చరిత్ర! అంతటి చరిత్ర ఉన్న పథకం అది! మరి అలాంటి పథకాలను ప్రవేశపెట్టే విషయంలో స్వయంగా వైకాపా శాసనసభ్యురాలే కనీస జాగ్రత్తలు పాటించకపోతే… వైఎస్ అభిమానులకు, వైకాపా కార్యకర్తలకు కడుపుమండదా?
ఏమాత్రం అవకాశం ఉన్నా మంత్రి అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో… నిర్లక్ష్యంతో కూడిన ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదని విడదల రజనీకి పార్టీ వర్గాలు హితవు పలుకుతున్నాయి.వ్యక్తిగతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తే వైసీపీలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పార్టీ వర్గాలు ఆమెను హెచ్చరిస్తున్నాయి.విడదల రజని వారి మాటలు వింటారా ?