వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో టిడిపి మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా?…గత కొన్ని రోజులుగా ఎపి రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపికి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, నాలుగేళ్లు మిత్రులు గానే వ్యవహరించిన వీరు తదనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో ఉప్పునిప్పులా మారిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవలే చంద్రబాబు మళ్లీ పవన్ తో పొత్తు విషయమై కొంత సానుకూలమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వైసిపి, టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబును దెబ్బతీసేందుకే వారు కలుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి జనసేనతో టిడిపి పొత్తు విషయం తెరమీదకు వచ్చింది.
దీంతో వచ్చే ఎన్నికల్లోనూ టిడిపి-జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమనే విశ్లేషణలు మళ్లీ జోరందుకున్నాయి. పవన్ తో పొత్తు పెట్టుకోవాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఇటీవల పవన్ గురించి వ్యాఖ్యలు చేశారని…అంతేకాకుండా మోడీ కనుసన్నల్లోనే పవన్ కూడా నడుస్తున్నారంటూ ఇటీవలి వరకు పవన్ పై కూడా చేసిన విమర్శలు ఈ మధ్య కాలంలో చేయడం లేదంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అంతేకాదు పవన్-టిడిపి మధ్య పొత్తు ఏ ప్రాతిపదికన ఉండొచ్చనే అంశాలపై సైతం ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే ఈ పొత్తుకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే ఆసక్తిగా ఉన్నారని…అందువల్లే పాతిక ఎమ్మెల్యే, రెండు మూడు ఎంపీ టికెట్ల వరకూ జనసేనకు కేటాయించడానికి సైతం చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని తమకి తెలిసిందనే ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. ఇదంతా వైసిపి మద్దతుదారులు సాగిస్తున్న దుష్ప్రచారంగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేయడం ఖాయమని పునరుద్ఘాటిస్తున్నారు.