అమరావతి: శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చుకున్న పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనీ ఈ విషయంలో ఆయన ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విమర్శలు కొనసాగించారు.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదని విజయసాయిరెడ్డి అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఈ 40ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
రాష్ట్రాన్ని రాబందులా పీక్కు తిన్నారని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. భావితరాలకు ఆయన చరిత్ర అలానే గుర్తుండిపోతుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ స్పష్టం చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు.