రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి కరోనా రూపంలో చుక్కలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో సిఎం కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నుండి సామాన్యుల వరకూ అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఓ దళిత రైతు మృతి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోనీ వర్గాల మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు నరసింహులు ఆత్మహత్య కేసీఆర్ సర్కార్ ని ముప్పుతిప్పలు పెడుతోంది. నరసింహులు అనే రైతుకు చెందిన 13 గుంటల భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు కోరారు.
అయితే ఈ సమయంలో ఆయన భూమి రికార్డు లోకి కూడా ఎక్కలేదు. దాంతో పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నరసింహులు మృతి చెందటంతో….నరసింహులు సొంత భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల ఒత్తిడి వల్లే ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే టైమ్ లో ప్రతిపక్ష పార్టీలు కూడా కేసిఆర్ సర్కార్ తీరు వల్లే ఈ ఘటన జరిగినట్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఏపీలో విశాఖపట్టణం ఎల్జి పాలిమర్స్ ఘటన లో మృతి చెందిన వారికి అక్కడ సీఎం జగన్ ఏ మాదిరిగా ప్రభుత్వం తరఫున కోటి నష్టపరిహారం అందించాడో….అదే రీతిలో నరసింహులు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా కేసిఆర్ ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయ. అంతేకాకుండా మృతుడి కూతురుకి ప్రభుత్వం తరపున ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్లు విని వామ్మో అని అవాక్కవుతున్నారట.