వైసీపీలో ఉన్న కోవర్టులను ఏరిపారేసే ప్రక్రియకి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కసరత్తు ప్రారంభించారు.ఇందులో భాగంగా ఆయన పార్టీలో ఉన్న కోవర్టుల జాబితాను ఇప్పటికే సేకరించారంటున్నారు.అయితే ఇక్కడ అనూహ్యమైన విషయం ఏమిటంటే అందరూ భావించినట్లు వైసిపిలో కొత్తగా చేరిన టీడీపీ వారే కాకుండా అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యులు కూడా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని తేలడం!ఒక మంత్రితో సహా నెల్లూరు రాయలసీమ జిల్లాలకు చెందిన సీనియర్ వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం.మొత్తంగా చూస్తే పది నుండి పదిహేను మంది కోవర్టులు లెక్క తేలారట. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత కీలకమైన విషయాలు బహిర్గతం అయిపోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వీటిని ఎప్పటికప్పుడు ప్రచురించి వైసిపిని ముఖ్యమంత్రిని ఇరకాటంలోకి నెడుతోంది.విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది.ముందుగా పార్టీ వారికి ఎలాంటి విషయాలు లీక్ చేయవద్దంటూ సుతిమెత్తగా వర్తమానం పంపారు.అయినా ఇది ఆగలేదు.అన్నింటికి మించి ఇటీవల ముఖ్యమంత్రి జగన్ జరిపిన ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన అంశాలు కూడా లీక్ అయిపోయాయి.దీంతో జగన్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.వెంటనే కీలకమైన విషయాల్ని లీక్ చేస్తున్న వారిని కనిపెట్టాల్సిందిగా సీఎం నేరుగా ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించారని భోగట్టా!రాజాజ్ఞతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని విషయాలను జల్లెడ బట్టి పది నుండి పదిహేను మంది లీకువీరుల పేర్లతో ఒక జాబితాను ఆయనకు సమర్పించేశారని కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ జాబితా చూసి నివ్వెరబోవడం ముఖ్యమంత్రి వంతయిందట! తనతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఒకరిద్దరి పేర్లు జాబితాలో ఉండటంతో జగన్ బిత్తరపోయారట.అయితే ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉండటంతో ఆయన తక్షణ చర్యలకు ఉపక్రమిస్తారని ఈరోజో రేపో లీకువీరులపై వేటు పడటం ఖాయమని వైసిపి వర్గాలు తెలిపాయి.జగన్ నైజాన్ని బట్టి చూస్తే ఈ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.