Advocates Murder case : హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్రావు, నాగమణి జంట హత్యల కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుల విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా విపక్షాలు ఆరోపణలు చేయడం, న్యాయవాదులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో పోలీస్ యంత్రాగం కేసును త్వరగా ఛేదించే పనిలో పడింది. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వామన్ రావు దంపతులను హత్య చేసి పారిపోయిన నిందితులను సెల్ ఫోన్ సిగ్నల్ లోకేషన్ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
నిన్న హత్యలు జరిగిన అనంతరం వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదుపై కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కుంట శ్రీనివాస్ తో పాటు మంథని మండలం విలోచనపురంకు చెందిన చిరంజీవి కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Advocates Murder case :పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధుపై అనుమానాలు
వామన్రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు కావడంతో ఆయన ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్ట మధు, వామన్ రావు కు మధ్య గొడవలు కూడా ఉన్న కారణంగా హత్యల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు మంథని మండల టిఆర్ఎస్ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. నిందితుల విచారణలో అతని పేరు కూడా వెలుగులోకి వచ్చిందన్న సమాచారం రావడంతో పుట్ట మధు హైదరాబాద్ కు పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి.
పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అక్రమాస్తులు కుడబెట్టారని వామన్ రావు ఫిర్యాదులు చేశారు. అదే విధంగా ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వామన్ రావు దంపతులు కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ కారణంగా వామన్ రావు హత్యలో పుట్ట మదు పేరు ప్రముఖంగా వినబడుతోంది. వామన్ రావు హత్య రాజకీయ హత్యేనని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాగా ఈ రోజు రాత్రి 8గంటలకు నిందితులను మీడియా ఎదుట హజరుపర్చి ఘటన వివరాలను ఐజీ నాగిరెడ్డి వెల్లడించనున్నట్లు సమాచారం.