Road Accident: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సూర్యపేట జిల్లా మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ను విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు అయ్యప్ప స్వామి భక్తులు శనివారం రాత్రి సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో జరిగిన మహా పడి పూజకు హజరైయ్యారు. పడి పూజ అనంతరం ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది భక్తులు ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు.
వీరు తిరుగు ప్రయాణం అవ్వడానికి అయ్యప్ప ఆలయం నుండి కిలో మీటరున్నర దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉండగా, ట్రాక్టర్ డైవర్ అంత దూరం వెళ్లడం ఇష్టం లేక త్వరగా ఇంటికి వెళ్లవచ్చన్న భావనతో రాంగ్ రూట్ లో ట్రాక్టర్ నడిపారు. ఇదే వాళ్ల పాలిట శాపం అయ్యింది. పది నిమిషాల్లో ఇళ్లకు వెళతాము అనుకుంటున్న తరుణంలో విజయవాడ వైపు వెళుతున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఉదయ్ లోకేష్, తన్నీరు ప్రమీల, గండు జ్యోతి, చింతకాయల ప్రమీల, కోటయ్యలు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడగా, అంబులెన్స్ తో పాటు ఇతర అందుబాటులో ఉన్న వాహనాల్లో స్థానికులు కోదాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.