భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపి, తెలంగాణలో పర్యటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో జరిగిన బహిరంగ సభలో సింగరేణి కార్మికులకు మాత్రం ప్రైవేటీకరణ అంశంపై భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తొంది. ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు నెలలు తరబడి ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ విశాఖ పర్యటనలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు భద్రాచలం – సత్తుపల్లి రైల్వే లైన్ ను ప్రారంభించారు. మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని పరిశీలించారు.
ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల ఫాక్టరీతో తెలంగాణతో పాటు ఏపి, కర్ణాటక, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇదే సందర్భంలో సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చారు ప్రదాన మంత్రి మోడీ. సింగరేణి విషయంలో కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ఉందని, కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే ఉందని లెక్కలతో సహా వివరించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేస్తూ .. సింగరేణి విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్న 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిపారు పీఎం మోడీ. అబద్దపు మాటలను నమ్మవద్దని మోడీ విజ్ఞప్తి చేశారు.
Breaking: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు.. రిక్కర్ స్టేర్ స్కేల్ పై 5.4గా నమోదు