Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి సమీపంలోని గోడౌన్ లో రేపు ఉదయం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల ఓట్ల లెక్కింపు తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీకి డిమాండ్ చేశారు.
మునుగోడు ఎన్నికల్లో పార్టీలు డబ్బులు పంచిన రుజువులు సోషల్ మీడియాలో చాలా వచ్చాయని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపును తక్షణం నిలుపుదల చేసి జరిపిన ఎన్నికలను రద్దు చేయాలని ఆయన ఈసీని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్, వీడియో వైరల్ అయ్యింది. కాాగా తెలంగాణలో ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన ఆకునూరి మురళి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయనను ఏపి సర్కార్ ప్రభుత్వ సలహాదారు ( ప్రాధమిక విద్యాశాఖ మౌళిక సదుపాయాలు)గా నియమించింది. మూడేళ్లుగా ఆయన పాఠశాల విద్యాశాఖలో మౌళిక సదుపాయాల సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే నెల రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ, అక్కడి పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందని భావిస్తున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఆకునూరి మురళి. త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అమ్ ఆద్మీ పార్టీ లో గానీ, లేక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లో గానీ చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు ఆయన మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ లను విమర్శిస్తూ ఆరోపణలు చేయడం విశేషం.
Munugode Bypoll: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు .. రేపు తేలనున్న మునుగోడు ఉప ఎన్నిక విజేత
మునుగోడు ఎన్నికలలో BJP (4 వేలు)TRS (5వేలు)ఓటర్లకు డబ్బులు పంచిన రుజువులు సోషల్ మీడియా లో చాలా వచ్చినయి. ఈ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ని తక్షణమే ఆపాలి, జరిపిన ఎన్నికలు రద్దు చెయ్యాలి అని ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తున్నాము. తెరాస,బీజేపీ లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడం ఆపండి. pic.twitter.com/C6ca4eMyhH
— Murali Akunuri (@Murali_IASretd) November 5, 2022