తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనర్శింహస్వామి వారిని ముఖ్యమంత్రులు కేసిఆర్ (తెలంగాణ), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్ సింగ్ మాన్ (పంజాబ్), సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలను అందించారు. అయితే సీఎం కేసిఆర్ తో పాటు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ లో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి రాజాలు మాత్రం ఆలయ దర్శనానికి వెళ్లకుండా ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉండిపోయారు.
తొలుత ప్రత్యేక హెలికాఫ్టర్ లో యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న ముఖ్య మంత్రులకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఇవేళ ఆలయంలో మధ్యాహ్నం 1 గంట వరకూ అన్ని దర్శనాలను రద్దు చేశారు. సామాన్య భక్తులకు కూడా ప్రవేశం నిలిపివేశారు. ముఖ్యమంత్రులు ఆలయం మొత్తాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రులకు తెలంగాణ సీఎం కేసిఆర్ యాదాద్రి క్షేత్ర విశిష్టతను వివరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు తిలకించారు. యాదాద్రి పర్యటన అనంతరం ముఖ్యమంత్రులు హెలికాఫ్టర్ లో ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు బయలుదేరారు. ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు.