Breaking: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని ఆంధ్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన ఆరుగురు పెద్దలు, ఆరుగురు పిల్లలు టెంపో వాహనంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా వీరి టెంపో వాహనం అదుపుతప్పి కిన్నెరసాని వాగు సమీపంలో వంతెన కిందకి దూసుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, దుర్గారావు (40), శ్రీనివాసరావు (35) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మిగిలిన వారిని భద్రాచలం ఆసుపత్రిలో చేర్పించారు. భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రదీప్ (10), సందీప్ (12) మృతి చెందారు. నిర్మల అనే మహిళకు బలమైన గాయాలు కావడంతో భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బూర్గంపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.